కర్నూలు, జనవరి6: రాష్ట్రంలో బిజెపి, టిడిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలు కావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొననారు. ఆదివారం ఆయన కర్నూలులో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కేంద్రం కేవలం ఆరువేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు.
న్యాయబద్ధంగా హక్కులను అడిగితే బిజెపి నాయకులు అణిచి వేయాలని చూస్తున్నారని కృష్ణమూర్తి ఆరోపించారు. బిజెపియేతర కూటమి ఏర్పడకుండా దెబ్బతీయడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కేఈ అన్నారు. జగన్ తనపై ఉన్న కేసుల నుంచి ఉపశమనం కోసమే బిజెపితో దోస్తీ చేస్తున్నారని కేఈ విమర్శించారు. రాజ్యంగ వ్యవస్థలనూ, రాజ్యంగ సంస్థలనూ నాశనం చేసిన ప్రధాని మోదీని పదవి నుంచి దింపడమే తమ అంతిమ లక్ష్యమని కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు.