దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంటే మరోవైపు రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు స్టార్ట్ అయ్యాయి. డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కి మరియు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అప్పట్లో జరిగిన ఎన్నికలలో సచిన్ పైలెట్ కి ముఖ్యమంత్రి పదవి అధిష్టానం ఇస్తుందని భావించడం జరిగింది. కానీ అశోక్ గెహ్లాట్ కి కాంగ్రెస్ సీఎం పదవిని కట్టబెట్టింది. ఇటువంటి తరుణంలో వేరే కుంపటి పెట్టాలని తనకు మద్దతు తెలుపుతున్న ముప్పై మంది ఎమ్మెల్యేలతో సచిన్ పైలెట్… మోడీ- అమిత్ షా తో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో సంక్షోభంలో పడిన రాజస్థాన్ రాజకీయాలు గంట గంటకి ఉత్కంఠగా మారాయి. కాగా సచిన్ పైలెట్ వెనకాల బీజేపీ పార్టీ ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోడీ అమిత్ షా వ్యూహాలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. దేశంలో కరోనా పై పోరాడకుండా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా మోడీ- అమిత్ షా కలిసి రాజస్థాన్ రాజకీయాలను సంక్షోభంలో పడేసిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమవుతున్నట్లు జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి.
1999 నుండి బీజేపీ పార్టీతో కలిసి ప్రతిపక్ష పాత్ర పోషించిన శివసేన పార్టీ ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో ఆఖరి క్షణంలో బీజేపీకి షాక్ ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో ఇతర పార్టీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని స్థాపించింది. దీంతో బీజేపీకి శివసేన పార్టీ వెన్నుపోటు పొడవడంతో మోడీ -అమిత్ షా ద్వయం మహారాష్ట్ర సర్కార్ ని త్వరలో కూల్చడానికి రెడీ అవుతున్నట్లు ప్లాన్స్ వేస్తున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.