Narendra Modi-Amit shah: మోదీ, అమిత్ షా Narendra Modi-Amit shah ద్వయం దూకుడును రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగ్గించాయా? పరిస్థితి చూస్తే అలానే ఉందని చెప్పాలి. ఓపక్క కరోనా కట్టడి వైఫల్యం ఆరోపణలు.. మరోవైపు ఎన్నికల్లో వైఫల్యం. ప్రాంతీయ పార్టీల స్థానంలో రాష్ట్రాల్లో పాగా వేయాలనుకున్న బీజేపీ ఆశలకు ఎక్కడికక్కడ గండి పడుతూనే ఉంది. ఎంపీ ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఆధిక్యత చూసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే నిరాశే ఎదురవుతోంది. జాతీయస్థాయిలో మోదీ కావాలనుకున్నారు కానీ.. రాష్ట్రాల్లో కాదని తేలిపోయింది. ఓటర్ల తీరు బీజేపీకి మింగుడుపడనిదే. 2019 బెంగాల్ ఎంపీ ఎన్నికల్లో 18 ఎంపీ సీట్లు గెలిచిన ధైర్యంతో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని కైవసం చేసుకుందామనుకున్న వారి ఆశలు ప్రాంతీయ పార్టీ దెబ్బకి అడియాశలే అయ్యాయి.
తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి హవా సాగిద్దామనుకుంది. కానీ.. డీఎంకే కొట్టిన దెబ్బ చాలా గట్టిగా తగిలింది. కేరళ ఎన్నికల్లో గతంలో వచ్చిన ఒక్క సీటు కూడా పోయి అధికారం అనేది అల్లంత దూరంలోనే ఆగిపోయింది. ఏపీలో సరేసరి. 2014లో టీడీపీతో కలిసి వెళ్లి మెల్లగా పాగా వేద్దామనుకుంటే.. తనకు అడ్డొస్తే ఎవరైనా ఒకటే అనే చంద్రబాబు చాలా తెలివిగా బీజేపీని దూరం పెట్టేశారు. జనసేనతో కలిసి వెళ్లాలనుకున్నా.. సభలకు వచ్చిన జనం ఓటేయట్లేదు. తెలంగాణలో కూడా దుబ్బాక స్పీడు.. జీహెచ్ఎంసీలో కాస్త కనిపించినా సాగర్ ఎన్నికతో ఒన్ విన్ వండర్ గా మారిపోయింది. కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్ ల్లో అధికారంలో ఉన్నా.. ఎలా సాధించుకుందో చూసాం.
ఆపక్క మహారాష్ట్రలో శివసేన కొట్టిన దెబ్బకు బీజేపీకి కళ్లు బైర్లు కమ్మాయనే చెప్పాలి. ఈపక్క ఒడశాలో నవీన్ పట్నాయక్ కూడా బీజేపీతో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇలా ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీకి దెబ్బలే తగులుతున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు వత్తాసు పలికే ఏపీ సీఎం జగన్ కూడా బీజేపీ ఇక్కడ పాగా వేస్తామంటే ఒప్పుకుంటారా? ఇదే పరిస్థితి ప్రతిచోటా. బెంగాల్ దెబ్బకు ఈ విషయంల బీజేపీకి మరింతగా బోధపడినట్టే. దేశమంతా మోదీ మేనియా ఉన్న సమయంలోనే ఇలా రాష్ట్రాల్లో కుదురుకోలేకపోయింది. ఇక ప్రస్తుత కరోనా విలయానికి.. రీసెంట్ ఎన్నికల్లో ఓటమి దెబ్బ చూశాకైనా భవిష్యత్తులో రాష్ట్రాల్లో పాగా వేయాలనే ఆలోచన చేస్తుందా..? చూడాలి..!!