సోలాపూర్, జనవరి 9: విదేశాల నుంచి వలస వచ్చిన హిందూ మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్ర ప్రజల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. మహారాష్ట్రలోని సోలాపూర్లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ వాకౌట్ మధ్య మంగళవారం లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. ప్రతిపక్షాలు ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కోరుతున్నాయి.
ప్రజల అభిప్రాయాలను గౌరవించి రాజ్యసభ సభ్యులు ఇబిసి కోటా బిల్లుకు ఎటువంటి అడ్డంకి లేకుండా ఆమోదం తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వారి విద్యా, ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందుతున్న ఆశాభావం వ్యక్తం చేశారు.
గత రాత్రి లోక్సభలో చారిత్రక బిల్లుకు ఆమోదం లభించిందని, ఈ బిల్లు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని ఆయన అన్నారు. మా నినాదం ఒక్కటే సబ్కా సాత్..సబ్కా వికాస్. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కొంత మంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, రాజ్యసభ సభ్యులు ప్రజల అభిష్టం మేరకు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారని భావిస్తున్నాను అని మోదీ అన్నారు.