డిల్లీ, జనవరి 12: దేశ చరిత్రలోనే తొలి సారిగా ఏ అవినీతి ఆరోపణలు లేకుండా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగిన ప్రభుత్వం తమదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ, రామ్లీలా మైదానంలో జరుగుతున్న బిజెపి జాతీయ సమ్మేళనంలో రెండవ రోజైన శనివారం ఆయన పాల్లొని ప్రసంగించారు. తొలుత వివేకానందుడికి నివాళులర్పించారు. అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలన అందించామని చెప్పడానికి గర్వపడుతున్నానని మోదీ అన్నారు.
దేశం మొత్తం బిజెపి వైపు చూస్తున్నది. ప్రతి ఒక్కరూ బిజెపిపై నమ్మకం ఉంచారు. కార్యకర్తల శక్తి, సమిష్టి కృషి వల్ల వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. కార్యకర్తలు అందరూ సుశిక్షితులు, సంస్కారవంతులు. కార్యకర్తల త్యాగాలపై భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగిందని ఆయన కొనియాడారు. ఉన్న రిజర్వేషన్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించామని అన్నారు.
పదేళ్ల యుపిఎ పాలన అవినీతితోనే కొనసాగిందని విమర్శిస్తూ..దశాబ్దాల నిర్లక్ష్యంతో రైతులు కుదేలు అయ్యారని అన్నారు. ఈ దేశ రైతులకు నూతన జవసత్వాలు ఇచ్చేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నదనీ, అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు.
అద్భుతాలు చేయగలిగే శక్తి, సామర్ధ్యాలు దేశ యువతకు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా కొత్త పథకాలను తీసుకువస్తున్నాం. ప్రసూతి సెలవులను ఆరు నెలలకు పెంచామని ఆయన అన్నారు. సబ్ కా సాత్ అనేది ప్రభుత్వం ఒక దాని వల్ల రాదు ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఉండాలని మోదీ పిలుపు నిచ్చారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా మాట్లాడుతూ ఏ మహాకూటమీ తమను ఓడించలేదనీ, 2019 ఎన్నికల్లో బిజెపి విజయం సాధిచండం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.