న్యాయ వ్యవస్థకు ఏపీ సీఎం జగన్ కు జరుగుతున్న పోరు ప్రధాని మోదీకి పెద్ద పనే తెచ్చిపెట్టింది. గోడ మీద పిల్లిలా ఇన్నాళ్లూ తెరచాటు రాజకీయాల్ని పెంచి పోషించిన బీజేపీకి ఇప్పుడు ఏదొకటి తేల్చే సమయం వచ్చింది. అటు న్యాయ వ్యవస్థ.. ఇటు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ పోరులో తలదూర్చి పరిష్కారం చూపాలి. అంటే ఒక రకంగా జగన్ మొదలుపెట్టిన పోరాటానికి అనుకూలమో వ్యతిరేకమో తేల్చుకోవాలి. న్యాయవ్యవస్థలో జస్టిస్ రమణ అండ్ కో.. ముందుకు పోకుండా ఆపాలి. ఈ రెండింటినీ నేరవేర్చాల్సింది ప్రధాని మోదీనే. మరి.. ఇప్పుడు బీజేపీ పెద్దలు ఏలా ముందుకెళ్తారో చూడాల్సిందే. వారు ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారనేదే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
మోదీకి పెద్ద పనే పడింది.. తేల్చుకోవాల్సింది ఆయనే..
సీఎం జగన్ ఇప్పుడు రెండో దశ వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్దమవుతున్నారు. జస్టిస్ రమణపై అభిశంశన తీర్మానం ప్రవేశపెట్టడమా.. లేదా మరిన్ని అభియోగాలతో రాష్ట్రపతికే అధికారికంగా ఫిర్యాదు చేయడమా అనేది ఆలోచిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది జరిగినా కేంద్రానికే పెద్ద పని. పరిష్కారం చూపాల్సింది మోదీనే. అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే ఎంపీల మద్దతు ఉండాల్సిందే. ఇది జగన్ కు ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా మళ్లీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్దకే పంపిస్తారు. అంటే.. ఈ తతంగాన్ని ఏ టు జెడ్ అనధికారికంగా నడిపించేది కేంద్రంలోని బీజేపీ పెద్దలే.
న్యాయ వ్యవస్థ అడుగులు బయటకు కనపడవు..
ఇటువైపు నుంచి సీఎం జగన్ ఏం చేసినా రాజకీయ వర్గాల్లో బయటకు వచ్చేస్తుంది. మీడియాకు కూడా తెలిసిపోతుంది. కానీ.. న్యాయ వ్యవస్థ ఏం చేసినా అంతర్గతంగానే జరుగుతుంది. ఉదాహరణకు.. సుప్రీంకోర్టు జడ్జిపై సీఎం జగన్ చేసిన అభియోగాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 121 ప్రకారం నిరాధారమని.. జగన్ పై చర్యలు తీసుకోవాలని ఓ పిటిషన్ దాఖలైంది. వీటి వెనుక ఏపీకి సంబంధం లేనివారు ఉన్నారా.. లేక సంబంధం ఉన్నవారే ఇలా చేస్తున్నారా అనేది బయటకు రాదు. న్యాయవ్యవస్థ చర్యలు ఇలానే ఉంటాయి. బయటకు కనిపించకుండా జగన్ కు నష్టం చేకూర్చేలా ఉంటాయి. ఇవన్నీ జరిగితే అంతిమంగా నష్టపోయేది ఏపీ రాష్ట్రమే. అందుకే.. కేంద్రం ఇందులో కాషాయ గుబాళాన్ని, వారి రాజకీయ పెత్తనాన్ని చూసుకోకుండా పరిష్కార మార్గం చూపడమే తక్షణ కర్తవ్యం.