తిరుపతి: టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టిఆర్ మరణానికి చంద్రబాబే కారణం అంటూ ప్రముఖ సినీనటుడు మంచు మోహన్బాబు ఆరోపించారు. తిరుపతిలో ఆదివారం వైసిపి అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో మోహన్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోహన్బాబు ఆదివారం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
టిడిపిని అభిమానించే వారంతా వైసిపిలోకి వస్తున్నారని మోహన్బాబు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వైసిపికి అనూహ్య స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
డబ్బులు ఇచ్చి ట్విట్టర్లో తనపై మాటల దాడి చేయిస్తున్నారని మోహన్బాబు ఆరోపించారు.
ఎన్టిఆర్ మరణానికి చంద్రబాబే కారణమని విమర్శ చేస్తూ నాడు నాకు చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి అని మోహన్బాబు అన్నారు. అప్పుడు ఎన్టిఆర్ను కలిసి వాస్తవాలను తెలుసుకున్నానని మోహన్బాబు తెలిపారు.
‘చంద్రబాబు మూర్ఘుడు, గతం తెలుసుకొని మాట్లాడాలి, నన్ను ఎవడు అంటావా’, అంటూ మోహన్బాబు రెచ్చిపోయారు.
రాత్రికి రాత్రి ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఇక చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని మోహన్బాబు జోస్యం చెప్పారు. చంద్రబాబు చరిత్ర ఎంటో నా దగ్గర ఓ పుస్తకమే ఉందని మోహన్బాబు అన్నారు. టిడిపి చంద్రబాబు పార్టీ కాదని అన్నారు.