మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ మరో సారి విచారణకు హజరు కావాలని ఆదేశించడం, ఈ కేసులో ఆయన తండ్రి భాస్కరరెడ్డి ని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో అవినాష్ రెడ్డి పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో నిందితులైన ఇద్దరు వారు ఇళ్లలో లేని సమయంలో వివేకా వారి నివాసాలకు వెళ్లేవారని చెప్పారు. అంతే కాకుండా నిందితులతో వివేకా డైమండ్స్ వ్యాపారం చేశారని పేర్కొన్నారు. వివేకా రెండో భార్యతో వివేకా కుటుంబ సభ్యులకు ఆర్ధికపరమైన అంశాల్లో వివాదాలు నడుస్తున్నాయని కూడా ఆరోపించారు. వివేకా హత్య తో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న అవినాష్ రెడ్డి.. తనకు సీఆర్పీసీ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసిందనీ, తన స్టేట్ మెంట్ ను రికార్డు చేసిందని చెప్పారు. వివేకా కుమార్తె సునీత, స్థానిక ఎమ్మెల్సీ, టీడీపీ అధినేత చంద్రబాబు, సీబీఐ అధికారి అందరూ కుమ్మక్కయ్యారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. కుట్రలతో తనను ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. కేవలం గూగుల్ టేకౌట్ ద్వారా తనను నిందితుడుగా చేర్చారని చెప్పారు. దస్తగిరిన సీబీఐ అధికారులు ఢిల్లీకి తీసుకువెళ్లి చాలా రోజులు అట్టిపెట్టుకున్నారనీ, డబ్బు లిచ్చటి ఆయనను అప్రూవర్ గా మార్చారని ఆరోపించారు.
తనకు సంబంధం లేని కేసులో ఇరికించాలనుకుంటున్నారని, న్యాయంపై తనకు నమ్మకం ఉందని అన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరుతున్నానని విన్నవించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను కొద్ది సేపటిలో విచారణ చేయనున్నది. అవినాష్ రెడ్డి ఇంతకు ముందు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసి మళ్లీ ఉపసంహరించుకున్నారు. తాజాగా మరో సారి విచారణకు సీబీఐ నోటీసులు జారీ చేయడం, భాస్కరరెడ్డిని అరెస్టు చేయడంతో అవినాష్ రెడ్డి మరో సారి హైకోర్టును ఆశ్రయించారు.