MP RRR: రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు ఏపీ సీఐడీ విచారణకు హజరు కావాలంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన నర్సాపురం పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజమండ్రి వైసీపీ ఎంపి మార్గాని భరత్ రఘురామపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ సీఐడీ విచారణ ఎదుర్కోలేక రఘురామ కృష్ణంరాజు ఢిల్లీకి పారిపోయారంటూ భరత్ కామెంట్స్ చేశారు. రఘురామపై అనర్హత వేటు ఖాయమని పేర్కొన్నారు.
MP RRR: విచారణను ఎందుకు ఎదుర్కోవడం లేదు
చట్టంపై గౌరవం ఉందని చెబుతున్న రఘురామ విచారణను ఎందుకు ఎదుర్కోవడం లేదని భరత్ ప్రశ్నించారు. రఘురామ జగన్ దయాదాక్షిణ్యాలతోనే ఎంపి అయ్యారన్నారు. పార్టీ అధినేత ఎంపి పదవి ఇస్తే ఏమి విశ్వాసం చూపిస్తారని అన్నారు. సీఎం జగన్ ను విమర్శించే స్థాయా అని ప్రశ్నించారు. మరో పక్క రఘురామపై పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.
రఘురామపై కేసు నమోదు – ప్రధానికి ఫిర్యాదు
సీఐడీ అధికారులు ఆయనకు విచారణ హజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన తర్వాత సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చింతలపూడి పోలీస్ స్టేషన్ లో రఘురామపై గొంది రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రఘురామ కృష్ణంరాజు తనకు ప్రాణ హాని ఉందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. గతంలో సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై చేసిన ఫిర్యాదులను ఉటంకిస్తూ తనకు ప్రాణ హాని తలపెట్టారంటూ ఆరోపణలు చేశారు. తనపై అంబేద్కర్ ఇండియా మిషన్ సంస్థ ద్వారా రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేయించారని రఘురామ పేర్కొన్నారు.