రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ.. ఓ నాయకుడు తాను గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అదే పార్టీలో రెబల్ గా మారడం అత్యంత అరుదుగా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది. సాక్షాత్తూ ఏపీ సీఎం జగన్ ఈ తిరుగుబాటు రాజకీయాన్ని ఎదుర్కొంటున్నారు. నరసాపురం నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణ రాజు నిత్యం సీఎం జగన్ పై, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గానికి రాకుండా ఢిల్లీలోనే ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న విమర్శల నేపథ్యంలో.. తాను నియోజకవర్గానికి రాలేనని భయం వేస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు కూడా.
ఎంపీ భద్రతతో వస్తారని వైసీపీ శ్రేణుల ఎదురుచూపులు..
ఈనేపథ్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేలను కేంద్రంలోని పెద్దలకు బూచిగా చూపించారు. నరసాపురం వెళ్తే తనపై దాడులు జరిగే అవకాశం ఉందని ఏకంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు చెప్పుకున్నారు. తనకు అదనపు భద్రత ఇవ్వాలని కోరారు. ఆయన విన్నపం మేరకు కేంద్రం రఘురామకృష్ణ రాజుకు వై కేటగిరీ భద్రత కల్పించింది. దీంతో ఆయనకు ఉండే భద్రతకు అదనంగా 13 మందితో అదనపు భద్రత కల్పించింది కేంద్రం. రాష్ట్రంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మాత్రమే ఆస్థాయి భద్రత ఉంది. మరి.. ఇంతటి భద్రత తీసుకుని కూడా ఆయన నరసాపురం ఎందుకు రావడం లేదనేది స్థానిక వైసీపీ నాయకుల ప్రశ్న. కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం కానీ.. నియోజకవర్గంలో పర్యటించడం కానీ చేయకపోగా పార్టీలో ఉంటూనే ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని వైసీపీ నాయకులు రఘురామకృష్ణ రాజుపై ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ఎంపీకి తన నియోజకవర్గంపై, ప్రజలపై బాధ్యత లేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నరసాపురం రాకుండా ఢిల్లీలో కూర్చుని ఆయన చేస్తున్న రాజకీయం కూడా దీనినే బలపరుస్తోంది.
భద్రత ఇచ్చి బీజేపీ తప్పు చేసిందా..
రఘురామకృష్ణ రాజు తీరుపై ఇప్పుడు బీజేపీలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎంపీ మాటలు విని కేంద్రం భద్రత కల్పించింది. కానీ.. ఆయన ఢిల్లీని ఎందుకు వీడటం లేదో.. ఏ భయం చూపించి భద్రత తీసుకున్నారో అదే భద్రతతో నరసాపురం వెళ్లాలి కదా అనే ప్రశ్నలు కేంద్రం పెద్దల్లో కూడా వ్యక్తమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఉంటూ వైసీపీకి వ్యతిరేకంగా.. టీడీపీకి అనుకూలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నాయకత్వం సైతం మండిపడుతోంది. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఏకంగా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. ఏపీ రాజధాని విషయం ఆ రాష్ట్రం ఇష్టం అంటూ కేంద్రం ఇటివలే హైకోర్టుకు రాతపూర్వకంగా తెలిపింది కూడా. అయినా.. కేంద్రంపై ఎంపీ వ్యాఖ్యలు చేయడాన్ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. మాకు సలహాలు ఇచ్చేకంటే మీ పరిస్థితి గురించి ఆలోచించుకోండి అంటూ కౌంటర్ కూడా వేశారు.