వైసీపీ టికెట్ తో నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్ధిగా గెలిచిన రఘురామకృష్ణ రాజు గెలిచిన సంగతి తెలిసిందే. ఏడాది తిరిగేసరికి అదే పార్టీకి రెబల్ గా మారిపోయిన సంగతి కూడా తెలిసిందే. పార్టీకి ఎంపీకి మధ్య పరిస్థితులు చివరి దశలో ఉన్నాయనే చెప్పాలి. కొన్నాళ్లుగా పార్టీని, సీఎం జగన్ ను ఇరుకునబెట్టే విధంగా ఉన్న ఆయన చర్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఏకంగా సొంత పార్టీలోని నాయకులతోనే ప్రమాదం ఉందని చెప్పి కేంద్రం నుంచి భద్రత కూడా తెచ్చుకున్నారు. పార్టీ అధినేతగా, సీఎంగా జగన్ తీసుకుంటున్న ప్రతి చర్యను తప్పపడుతున్న రఘురామకృష్ణ రాజుకు పార్టీ నుంచి మరో ఝలక్ వచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై జగన్ ఎంపీలు అందరికీ మార్గనిర్దేశం చేశారు. అయితే.. రఘురామకృష్ణ రాజుకి మాత్రం సందేశం వెళ్లలేదు. దీనిపై ఆయన స్పందించారు.
పార్టీ నుంచి నన్ను బహిష్కరించినట్టే..
‘ఎంపీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉందని 9 గంటలకు ఏపీ భవన్ నుంచి ఆహ్వానం అందింది. అంతలోనే 11:11 గంటలకు ఫోన్ చేసి పార్టీకి మీకు సంబంధం లేదు.. సమావేశానికి రావొద్దని చెప్పారు. దీంతో నన్ను వైకాపా నుంచి బహిష్కరించారనే భావిస్తున్నాను. దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. నన్ను బహిష్కరించినప్పటికీ పార్టీ జారీ చేసే విప్ ను పాటిస్తాను. న్యాయ నిపుణులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతం నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. మీడియాలో కూడా విద్యావంతులు ఉన్నారు కదా.. దీనిపై మీరు ఎలా రాసుకుంటారో రాసుకోండి’ అంటూ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు.
రాజీనామా చేయాల్సిన అవసరం నాకు లేదు..
‘మరోసారి నాపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారని భావిస్తున్నాను. పార్టీకి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కొందరు అంటున్నారు. అమరావతి విషయంలో మాట తప్పిన వారే రాజీనామా చేయాలి. అమరావతిలోనే రాజధాని ఉంటుందని ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ.. ఇచ్చిన హామీకి, చెప్పిన మాటకు వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నారు. మాట తప్పిన మీరే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. రాజీనామా చేయాల్సిన అవసరం నాకు లేదు’ అని రఘురామకృష్ణ రాజు అన్నారు. దీంతో ఆయనకు వైఎస్సార్సీపీకి మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయినట్టేనని భావిస్తున్నారు.