Mp Subramanian Swamy: ఎంపీ సుబ్రమణ్యస్వామి Mp Subramanian Swamy జోలికి ఎవరూ వెళ్లరు, ఆయన మాత్రం ఎవరి జోలికైనా వెళ్తారు. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. వివాదాలను కొనితెచ్చుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ బీజేపీనే ఇరుకునపెట్టే ప్రశ్నలు వేసి వార్తల్లో నిలిచారు. ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కరోనా వచ్చింది చైనా నుంచి అనేది ఓ వాదన. వచ్చిందో.. చైనానే పంపించిందో కానీ.. ఆదేశాన్ని విమర్శించి, ప్రశ్నించే తీరక లేక బతికి బయటపడటంతోనే బిజీ అయిపోయింది ప్రపంచం. పరిస్థితులు అలాంటివి. ఇప్పుడు మళ్లీ ప్రపంచ దేశాలు చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అమెరికా కూడా చైనాను విమర్శించి ప్రశ్నిస్తోంది. కానీ.. భారత్ సైలెంట్ గా ఉంది. దీనిపైనే సుబ్రమణ్య స్వామి సొంత పార్టీని కడిగేశారు.
సుబ్రమణ్యస్వామి బీజేపీని ఇరుకునపెట్టే ప్రశ్నలే వేశారు. కరోనా వ్యాపించడానికి కారణం చైనా. కరోనా మూలాలన్నీ వ్యూహాన్ లోనే ఉన్నాయని ఏడాదిన్నరగా వార్తలు వస్తున్నాయి. చైనా తీరును అమెరికా సూటిగా ప్రశ్నిస్తోంది. భారత్ మాత్రం మాట్లాడటం లేదు. ఇదే అంశాన్ని సుబ్రమణ్యస్వామి లేవనెత్తారు. వ్యూహాన్ ప్రాజెక్టులో వైరాలజీ పరిశోధనలకు అమెరికా ఆర్ధిక సాయం అందించింది. అందుకే చైనాను ప్రశ్నించగలుగుతోంది. కానీ.. భారత్, నాగాలాండ్ లో వ్యూహాన్ జరిపిన పరిశోధనల్లో మన శాస్త్రవేత్తలు, ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారులు భాగస్వాములు అయ్యారు. పైగా.. చైనా నుంచి గౌరవ వేతనం కూడా అందుకున్నారు. అందుకే చైనాను.. భారత్ ప్రశ్నించలేక పోతోంది. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది.
Read More:Bjp-Tdp-Janasena: టీడీపీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ వెనుక పవన్..! ఎంత నిజం..?
మొత్తంగా కరోనా వైరస్ వ్యాప్తిలో భారత్ కు కూడా భాగముందనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చైనాతో భారత్ కు లింకు ఉందనే సంకేతాల్ని కూడా ఇచ్చినట్టైంది. ఇప్పటికే భారత్ లో సెకండ్ వేవ్ ధాటికి కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. విపక్షాలు, ప్రజలు.. దేశం మొత్తం మోదీ వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సుబ్రమణ్యస్వామి కామెంట్లు దుమారం రేపేవే. ప్రస్తుతానికైతే ఎంపీ ఆరోపణలపై ఎవరూ స్పందించలేదు. బీజేపీని ఇరుకునపెట్టే రీతిలో సుబ్రమణ్యస్వామి చేసినవి నిరాధార ఆరోపణలో.. నిజాలో ప్రభుత్వానికే తెలియాలి..