ఒకప్పుడు సమాజ హితం కోసం మాత్రమే పనిచేసే జర్నలిజం.. నేడు ఏదొక రాజకీయ పార్టీకి, వ్యవస్థకు అనుకూలంగా సేవ చేసే స్థితికి వచ్చేసింది. వార్తను వార్తలా రాయడం, చూపించడం నుంచి సెన్సేషన్ కోసం పాకులాడే పరిస్థితి వచ్చింది. ఇదంతా ఆధునిక భారతంలోని జర్నలిజం. కానీ.. జర్నలిజం, వార్తా పత్రిక పఠనం మొదలైనప్పుడు పరిస్థితులు వేరు. కాలంతోపాటు వాటి తీరు కూడా మారిపోయింది. పేపర్ నుంచి ఈ-పేపర్ కు వార్తా పఠనం వచ్చేసింది. వ్యాపార ధృక్కోణంలో వార్తా పత్రికలు తమ గమనాన్నే మార్చేసుకుంటూ.. దీనికి కరోనా భూతాన్ని చూపిస్తున్నాయి. ఏదేమైనా వార్తా పత్రికల మనుగడ ఇక కొంత కాలమే అనిపిస్తున్నాయి. టైమ్స్ గ్రూప్ టాబ్లాయిడ్ ‘ముంబై మిర్రర్’ పూర్తిగా షట్ డౌన్ కావడం ముంబై వాసుల్నే కాదు.. పత్రికా ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది.
దశాబ్దాల చరిత్ర కనుమరుగేనా..
ముంబై వాసులకు ముంబై మిర్రర్ మానస పుత్రిక. ‘కరోనా పరిస్థితుల వల్ల ముంబై మిర్రర్, పూణె మిర్రర్, మూసేస్తున్నాం. ఇకపై వారపత్రికలుగా మారుస్తున్నాం.. ఈపేపర్ ఉంటుంది..’ అని యాజమాన్యం వివరణ ఇచ్చింది. కారణమైదైనా.. ముంబై మిర్రర్ మూతపడింది. దీంతో 1.6 కోట్ల మంది పాఠకలు వార్తలకు దూరమవుతున్నారు. 2016 చెన్నై వరదల సమయంలో 100 ఏళ్ల చరిత్ర ఉన్న ‘ది హిందూ’ దినపత్రిక తొలిసారి ఒకరోజు షట్ డౌన్ అయింది. ఇప్పుడు ముంబైలో ఏకంగా కొన్ని పత్రికలు (ది ఆఫ్టర్ నూన్ డిస్పాచ్ అండ్ కొరియర్, డీఎన్ఏ) పూర్తిగా మూతపడ్డాయి. పత్రికలే ఇష్టంగా కొందరికి.. బతుకుతెరువు మరికొందరికి.. జర్నలిజమే ఆధారం జర్నలిస్టులకు. ప్రభుత్వాలు, పారిశ్రామిక దిగ్గజాలు.. ఇలా ఎందరో పత్రికపై ఆధారపడుతున్నారు.
కాగితం స్పర్శకు సాటేది..
తెలుగులో కూడా కొన్ని ప్రధాన దినపత్రికలు టాబ్లాయిడ్లు ఆపేసి ఉద్యోగుల్ని తొలగించాయి. టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాయి. ఎడిటర్ గా గాంధీజీ పేరున్న పేపర్, 1947 నాటి పేపర్.. దశాబ్దం క్రితం పేపర్ కనబడితేనే మురిసిపోతాం. సినిమా ప్రకటనలు, ప్రభుత్వ ప్రకటనలు, యాడ్, సమాచారం, ఇలా పత్రికల్లోనే సమాచారం ఎక్కువ. కాగితం ఇచ్చే స్పర్శ, కంటి చూపుకు చలవ, చదివేందుకు మనసుకు ఆహ్లాదం.. ఇచ్చేది పేపర్ మాత్రమే. అటువంటి అనుభూతినచ్చే వార్తా పత్రికలు ఆగిపోవడం బాధించే విషయమే. వేకువజామున పేపర్ కోసం ఎదురుచూపులు.. కాఫీ తాగుతూ.. పేపర్ చదవడం ఇచ్చే అనుభూతే వేరు. ఉదయం ‘అరగంట లైఫ్’ మాత్రమే ఉండే దినపత్రిక కొంతకాలానికి ఓ జ్ఞాపకంలా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు.