Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరుపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా 11 గంటల వరకూ నాలుగు రౌండ్ల లెక్కింపు మాత్రమే పూర్తి అయ్యింది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి రౌండ్ ల వారిగా వచ్చిన ఫలితాలను విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ సందర్బంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చిన రౌండ్ల ఫలితాలను అప్పటికప్పుడు వెల్లడిస్తున్న అధికారులు బీజేపీ ఆధిక్యం సాధించిన రౌండ్ల ఫలితాలకు మాత్రం ఆలస్యంగా విడుదల చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రెండు, మూడు రౌండ్ లలో బీజేపీ ఆధిక్యత సాధించగా వెంటనే ప్రకటించలేదన్నారు. ఈ జాప్యానికి గల కారణాలను సీఇఓ తెలపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఈఓ వైఖరి అనుమానాస్పదంగా ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ లో ఏ మాత్రం తేడా వచ్చినా కేంద్ర ఎన్నికల సంఘానికి సీఇఓ పై ఫిర్యాదు చేసేందుకు వెనుకాడబోమని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి (సీఇఓ) వికాస్ రాజ్ కు నేరుగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి ప్రశ్నించారు. రౌండ్ల వారిగా ఫలితాల వెల్లడిలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీశారు. రౌండ్ల వారిగా ఫలితాలను జాప్యం లేకుండా వెల్లడించాలని ఆదేశించారు. కిషన్ రెడ్డి ఫోన్ చేసిన పది నిమిషాలకే నాలుగు రౌండ్ల ఫలితాలును ప్రకటించారు.