అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్సభ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా సినీ నటుడు నాగబాబు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. బధవారం నాగబాబు జనసేన పార్టీలో చేరారు. నాగబాబు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకి పార్టీ కండువా కప్పి స్వాగతించి భీ-ఫారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా టికెట్ ఇచ్చినందుకు సోదరుడు పవన్కు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. వరుసకు తనకు తమ్ముడే అయినా తనకు కూడా పవన్ నాయకుడేనని నాగబాబు అన్నారు.
రాజకీయాలకు సంబంధం లేకుండా తనదైన జీవితం గడుపుతున్న వ్యక్తిని తాను స్వయంగా పార్టీలోకి రమ్మని ఆహ్వానించానని పవన్ తెలిపారు. తనలో రాజకీయ చైతన్యం మొదలైంది తన సోదరుడు నాగబాబు వల్లేనని పవన్ అన్నారు.
దొడ్డి దారిలో కాకుండా ధైర్యంగా తన అన్నయ్యను నేరుగా ప్రజాక్షేత్రంలో నిలబెడుతున్నానని పవన్ చెప్పారు. ఆయన విజయం సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని పవన్ ధీమా వ్యక్తంచేశారు.
నర్సాపురం స్థానానికి టిడిపి తరుపున ఆ పార్టీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే శివరామరాజు, వైసిపి తరుపున రఘురామకృష్ణంరాజు, బిజెపి తరుపున మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు బరిలో ఉన్నారు. నాగబాబు రంగ ప్రవేశంతో పోటీ రసవత్తరంగా మారనుంది. ప్రస్తుతం నర్సాపురం ఎంపిగా బిజెపికి చెందిన గోకరాజు గంగరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.