Nagarjuna Sagar: నాగార్జునసాగర్ Nagarjuna Sagar ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ గెలిచి పట్టు నిలుపుకోవాలని టీఆర్ఎస్, పూర్వ వైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్, దుబ్బాక ఉప ఎన్నిక దూకుడు ఇక్కడా చూపించాలని బీజేపీ.. ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నిక కంటే పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్ధులే చర్చనీయాంశం అవుతున్నారు. నామినేషన్ కు రేపు ఒక్కరోజే ముందు టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించింది. ఇంతవరకూ బీజేపీ అభ్యర్ధిని ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్ కు ఈ విషయంలో పెద్దగా శ్రమ పడలేదు. జానారెడ్డి రూపంలో బలమైన అభ్యర్ధి ఉండటం వారికి కలిసొచ్చింది. ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాలో కాంగ్రెస్ ఉంది.
అయితే.. బీజేపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. బలమైన అభ్యర్ధులు, సామాజికవర్గం సమీకరణ, గెలుపోటములపై విశ్లేషణలతోనే ఇప్పటివరకూ గడిపేశారు. నిజానికి సాగర్ లో టీఆర్ఎస్ మంత్రులు, కొందరు పెద్దలు నెల రోజుల క్రితం నుంచే ఇక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసారు. నోముల నర్సింహులు బీసీ నేత కావడంతో అదే సామాజికవర్గ నేతకు టికెట్ ఇవ్వాలా.. కాంగ్రస్ నుంచి జానారెడ్డి ఉండటంతో రెడ్ల వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలా అనే ఆలోచించి నోముల నర్సింహులు తనయుడు నోముల భగత్ కే టికెట్ ఇచ్చింది. మరోవైపు బీజేపీది మరో కథ. అధిష్టానం ఇంకా అభ్యర్ధిని ఖరారు చేయకపోయినా స్థానిక బీజేపీ ఇంచార్జి కంకనాల నివేదితారెడ్డి నామినేషన్ వేయడం సంచలనం రేపుతోంది. పార్టీ కోసం తానెంత కష్టపడ్డానో అందరికీ తెలుసు అనే ధీమాతో ఆమె ఉన్నారు.
ఇన్ని అంశాల నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక అంశం హీటెక్కిపోయింది. ‘అందరం నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చుందాం.. ఎవరు గెలుస్తారో చూద్దాం..’ అని జానారెడ్డి సవాల్ చేయడం సంచలనం రేపుతోంది. దీంతో టీఆర్ఎస్ సైతం ఆలోచించే పరిస్థితి తలెత్తింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ గెలిచిన పరిస్థితులు ఇప్పుడక్కడ లేవని.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ అంటోంది. తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే ఇక్కడా వస్తాయని బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్ మాత్రం గతం మాదిరిగా ఢంకా భజాయించడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తోంది. నామినేషన్ ముందువరకే ఇంత ఆసక్తి రేకెత్తించిన సాగర్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరికి దక్కుతుందో చూడాలి.