అమరావతి: కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) సమీక్ష నిర్వహించటం విడ్డూరంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే ఎన్నికల సంఘం చూసుకోవాలి గానీ సిఎస్ సమీక్షించడమేంటని ఆనందబాబు ప్రశ్నించారు.
గురువారం అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆనందబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును మాత్రమే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారనీ, ఎల్వి సుబ్రహ్మణ్యంను సిఎస్ గా ఎన్నుకోలేదని నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. సిఎస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని ఆనందబాబు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందాల్సిన లబ్ధిని సిఎస్ అడ్డుకుంటున్నారని ఆనందబాబు ఆరోపించారు.
జగన్కు అనుకూలంగా కుట్రలు జరిగాయని ఆనందబాబు పేర్కొన్నారు. ఈ కుట్రల్లో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ భాగస్వాములయ్యాయని అన్నారు. 12కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న వైసిపి నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన ప్రతి పిటిషన్పైనా ఎన్నికల కమిషన్ చర్య తీసుకుందనీ, టిడిపి ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆనందబాబు అన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు చంద్రబాబు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారనీ, ఆయన ప్రచారంతో బిజెపి నేతల్లో వణుకు మొదలైందనీ ఆనందబాబు వ్యాఖ్యానించారు. సైనికుల త్యాగాలను, శాస్త్రవేత్తల పరిశోధనలను మోది తన ఖాతాలో వేసుకున్నారు తప్ప ఈ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో వివరించడం లేదని ఆనందబాబు అన్నారు.
మోదిని నమ్ముకుని ఎన్నికల్లో దిగిన జగన్ ఓటమిని రాష్ట్రంలోని ప్రజలు ఎప్పుడో ఖాయం చేశారని ఆనందబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టిడిపి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆనందబాబు జోస్యం చెప్పారు.