అమరావతి : పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్..‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.’మీరు ఊరుకో రాజభవనంలో ఉండొచ్చు. పేద వాడు అద్దె ఇంట్లో ఉన్నా చెత్త రూల్స్ పెట్టి రేషన్ కార్డు తీసేస్తారా?’అంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద వాడి పొట్ట కొట్టి 1500 కోట్ల రూపాయలు మిగుల్చుకొని ఏం సాధిస్తారు? ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్..‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని లోకేశ్ వ్యాఖ్యానించారు. జగన్ కు ఒక్క అవకాశం లభించడం వల్లే ప్రజలకు ఎన్నో కష్ట నష్టాలు, అనర్థాలు వచ్చాయని లోకేశ్ పేర్కొన్నారు.‘రివర్స్ టెండరింగ్’పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారనీ, పేద ప్రజలపై జగన్ కు ఉన్న వ్యతిరేకతను పెంచుకుంటూ పోతున్నారనీ, ఏడు లక్షల పెన్షన్లు ఎత్తేశారని దుయ్యబట్టారు.’మొన్నటి వరకూ ఒక్క పెన్షన్ కూడా తీసివేయలేదని బుకాయించిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు‘రీ వెరిఫికేషన్’ పేరిట కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టింది? 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకోవడానికి మనసెలా ఒప్పింది జగన్ గారు’ అంటూ లోకేశ్ ప్రశ్నించారు.