Narendra Modi.. ప్రధానిగా చాలా దూకుడైన నిర్ణయాలు తీసుకుంటారనే పేరు ఉంది. సమస్యలను సమయానుకూలంగా, సమయస్ఫూర్తితో చక్కదిద్దుతారనే పేరు కూడా ఉంది. పార్టీకి ఎంత నిబద్దతగా పని చేస్తారనే పేరు ఉందో ప్రధానిగా ప్రజల సంక్షేమాన్ని కూడా చూస్తారని పేరు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు మోదీపై పెద్ద ఆశలే ఉన్నాయి. కారణం.. గుజరాత్ ముఖ్యమంత్రిగా దాదాపు 13 ఏళ్లు అప్రతిహతంగా పరిపాలించిన విధానమే. గోద్రా వంటి సంఘటనల ముద్ర ఉన్నా.. గుజరాత్ లో చేసిన అభివృద్ధి.. పరిపాలనా తీరుతో దేశవ్యాప్తంగా మోదీ పేరు మోగిపోయింది. అదే స్పీడ్ తో ప్రధానిగా కూడా కొనసాగించారు. మొదటి అయిదేళ్ల పరిపాలనలో మోదీపై పెద్దగా రిమార్కులు లేవు. కానీ.. ఇప్పుడు రెండో టర్మ్ లో మాత్రం ఆయన నిర్ణయాలకు వ్యతిరేకత వస్తోంది.
GDP పెంచడం అంటే ఇదేనా? Narendra Modi
ప్రతిపక్షాలు ఆరోపణలు ఎలా ఉన్నాయంటే.. దేశ GDP పెంచుతామన్న మోదీ నిజంగానే పెంచారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్.. ధరలు పెంచారు.. GDP కి కొత్త నిర్వచనం ఇస్తున్నారు. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా చమురు ధరల పెరుగుదలకు కొన్నాళ్లుగా అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పేదలు, సామాన్యుల అభివృద్ధే ముఖ్యమని చెప్పే మోదీ.. అదే సామాన్యులకు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. ఎడాపెడా పెరిగిపోతున్న ధరలను ఏమాత్రం కట్టడి చేయటం లేదు. పైగా.. ఇటివలే ఆర్ధిక శాఖ మంత్రి చమురు ధరలపై స్పందిస్తూ.. పెరుగుతున్న ధరలపై చమురు కంపెనీలే ఆలోచించాలి అంటూ ఓ వ్యాఖ్య చేశారు. 2013 లీటర్ పెట్రోల్ డబ్బైల్లో ఉండగా కేంద్రం స్పందించాలి.. ధరలు తగ్గించాలి అపి ప్రతిపక్ష హోదాలో నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అధికారం లేనప్పుడు ఓ మాట ఉన్నప్పుడు ఓ మాట మాట్లాడతారా అంటూ విమర్శలు వచ్చాయి. అంటే.. ప్రతిరోజూ పెరుగుతున్న చమురు ధరల అదుపుకు తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పినట్టైంది. పెట్రోల్ 100 దాటేసింది.. డీజీల్ కూడా దగ్గర్లో ఉంది.
సామాన్యుడిపై గుది’బండ’..
గ్యాస్ గురించి ప్రత్యేకించి చెప్పాలి. యూపీఏ హయాంలో సిలిండర్ 344 ఉంటే ఇప్పుడు 846కు చేరింది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే మూడుసార్లు గ్యాస్ ధర పెంచేసింది. 4న 25, 15న 50.. ఇప్పుడు 25 పెంచింది. నేడు గ్యాస్ వినియోగం లేని ఇల్లు దాదాపు ఉండదు. మరి ఇలా గ్యాస్ ధర అడ్డూ అదాపూ లేకుండా పెరిగిపోతే.. సిలిండర్ 1000 కి చేరుకోవడానికి మరో ఏడాది సమయం చాలని చెప్పాలి. వీటన్నింటి భారం ప్రజలపై పడుతోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో లీటర్ పాల ధరను మార్చి 1 నుంచి 12 రూపాయలు పెంచాల్సిందేనని అక్కడి పాల వర్తకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాలు, కనీస అవసరు కూడా భారమైపోతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే నిత్యావసరాల ధరలు పెంచే వ్యాపారులు.. అవే ధరలు తగ్గితే మాత్రం పెంచిన స్థాయిలో తగ్గించరు. ఇవననీ సామాన్యులపై భారం పడేవే అని చెప్పాలి.
ఓటు ద్వారానే చెప్తారా..?
వ్యాపారం చేయడం ప్రభుత్వాల బాధ్యత కాదని కుండబద్దలు కొట్టేశారు ప్రధాని. బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ ఎల్, ఎయిర్ ఇండియా సాకు చూపించి ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారు. విశాఖ ఉక్కే కాదు.. మరో 46 ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ప్రైవేటుపరం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. దీంతో మోదీ ప్రభుత్వం తదుపరి కార్యచరణలు ఎలా ఉంటాయో అనే ఆలోచన మొదలైంది. ఇవన్నీ ప్రజలను పునరాలోచనలో పడేసేవే. మోదీ ప్రభుత్వంపై మొదటి నుంచీ ఉన్న విమర్శ.. పారిశ్రామిక దిగ్గజాల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని. మోదీ నిర్ణయాలు ప్రస్తుతం ఇదే నిరూపిస్తోంది. ఈ నిర్ణయాలన్నీ ప్రజలను సంతృప్తి పరుస్తాయా అంటే ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. రాజకీయంగా చేసే విమర్శలు బయటకు వస్తున్నా.. ప్రజల విమర్శలు బయటకు రావు. వారు ఏం చెప్పినా ఓటు ద్వారానే. దీనికి ఇంకా టైమ్ ఉంది. మరి.. దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శల పరంపరను మోదీ ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందో అదుపు చర్యలు ఏమేర తీసుకుంటుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?