న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 44మంది సీఆర్పీఎఫ్ మరణించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో దేశంలో జరిగిన ఉగ్రదాడులపై అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు మోదీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ ప్రసంగానికి సంబంధించిన ఆ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉగ్రవాదులు, నక్సల్స్ వద్దకు బాంబులు, ఆయుధాలు ఎలా వస్తున్నాయని ఆ వీడియోలో మోదీ ప్రశ్నించారు. దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే కదా? అని నిలదీశారు. సరిహద్దు రక్షక దళాలు మీ(కేంద్రం) చేతిలో ఉన్నా ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు.
అంతేగాక, ఉగ్రవాదులకు డబ్బులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఆర్బీఐ కేంద్రం ఆధ్వర్యంలోనే పనిచేస్తుందని, డబ్బులు ఉగ్రవాదుల చేతికి వెళ్లకుండా అడ్డుకోలేరా? ఎందుకు ఆ పని చేయడం లేదు? అని నాటి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని ప్రశ్నించారు.
ఉగ్రవాదులు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ దాడులకు పాల్పడి పారిపోతున్నారని.. త్రివిధ దళాలు మీ చేతిలో ఉన్నా.. ఇలా ఎందుకు జరుగుతోందని మోదీ ప్రశ్నించారు. సమాచార వ్యవస్థ కూడా కేంద్రం నియంత్రణలోనే ఉంటుందని.. ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ తనిఖీ చేసి ఉగ్రదాడులను ముందే ఆపే అవకాశం ఉన్నా? ఎందుకు చేయడం లేదని మోదీ నిలదీశారు.
దేశం నుంచి పారిపోయిన ఉగ్రవాదులు.. అక్కడ్నుంచే దేశంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని దౌత్యపరమైన సంప్రదింపులతో ఇక్కడికి తీసుకొచ్చి శిక్షించవచ్చని.. కానీ, కేంద్రం అలాంటి పని చేయడం లేదని అన్నారు. రాష్ట్రాల మీద అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.
తన ప్రశ్నలకు కేంద్రం వద్ద ఎలాంటి సమాధానం లేదని మోదీ ఆనాటి వీడియోలో అన్నారు. కాగా, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమేనని, మీరే ప్రధానిగా ఉన్నారని.. మరి ఎందుకు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని నెటిజన్లు నరేంద్ర మోదీని నిలదీస్తున్నారు.