Narendra Modi ; తమిళనాడు.. కేరళ.. పశ్చిమ బెంగాల్.. పుదుచ్చేరి.., అస్సాం.. ఈ అయిదు రాష్ట్రాల్లో ఈ నెల, వచ్చే నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి ఇవి కీలకం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని దేశం మొత్తం ఎదురు చూస్తున్నది.. ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటి వరకు అధికారం చేపట్టలేదు. మూడేళ్ళ కిందటి వరకు ఆ రాష్ట్రాల్లో వారికి క్షేత్రబలం, బలగం కూడా లేదు. 2019 లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బలం పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చాలా పావులు కదుపుతుంది..! ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు అంత సులువు కాదు. ఒకవేళ బీజేపీ గెలిస్తే సంచలనమే. దేశంలో బీజేపీకి తిరుగులేనట్టే. ఒకవేళ బీజేపీ ఓడితే మాత్రం మోడీ చుట్టూ ఒక నెగిటివ్ మాత్రం చుట్టుకోనుంది..! ఎందుకంటే..!?
Narendra Modi ; ఒక్కో చోట ఒక్కో ప్రణాళిక..!!
పశ్చిమ బెంగాల్ లో రాజకీయ పరిస్థితులు వేరు. అక్కడ లెఫ్ట్ వరుసగా గెలుస్తూ వస్తుండగా.. 2011 లో మొదటి సారిగా మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. అప్పట్లో ఆమె గెలుపు ఓ సంచలనం. ఆ తర్వాత ఆమె బలం పెంచుకున్నారు. బెంగాల్ లో అణగారిన వర్గాల ఓట్లు ఎలా తెచ్చుకోవాలో ఆమెకు బాగా తెలుసు. అందుకే 2016 లో మళ్ళీ గెలిచారు. ఇప్పుడు హ్యాట్రిక్ పై గురి పెట్టారు. నాడు లెఫ్ట్, కాంగ్రెస్ వంటి పార్టీలతో పోరాడిన మమత నేడు బీజేపీతో పోరాడుతున్నారు.
* బీజేపీ ఈ రాష్ట్రంలో గెలవడానికి చాలా ప్రణాళికలు వేస్తోంది. కాంగ్రెస్, లెఫ్ట్ లో బలమైన నేతలను చేర్చుకోవడం. మమతపై కేసులను, కొన్ని ఆరోపణలు చూపించి.. తృణమూల్ లో నేతలను లోబర్చుకోవడం వంటి కన్నింగ్ పాలిటిక్స్ కి తెరతీసింది. ఇప్పటికే చేరికల్లో దూకుడుగా ఉంది. ముస్లిం ఓట్లు కొల్లగొట్టడానికి ఎంఐఎం ని రంగంలోకి దించింది… కానీ ఇక్కడ బీజేపీ గెలుపు ఈజీ కాదు. మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో ఒక బలమైన శక్తి. ఆమె మాస్ లీడర్. ముస్లిం, ఎస్సి, బీసీ కులాలకు ఆమె బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా ఆమెతో కలిశారు. సో.. కన్నింగ్, క్రిమినాలిటీ పాలిటిక్స్ బాగానే చేస్తున్నారు.
* తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నా డీఎంకేతో బీజేపీ కలుస్తుంది. ఈ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక్కడ రాజకీయాలు సంప్రదాయ బద్ధంగా ఉంటాయి. వరుసగా రెండుసార్లు ఏ పార్టీ గెలవదు. కానీ.. 2016 లో మాత్రం అన్నా డీఎంకే రెండోసారి గెలిచింది. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. స్టాలిన్ ఒక బలమైన నేతగా మారిపోయారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకె పార్టీ సత్త చాటింది. వరుసగా రెండు సార్లు గెలిచిన.. జాతీయ పార్టీ గుప్పిట్లో ఉన్న అన్నాడీఎంకే కంటే డీఎంకే బెటర్ అంటూ తమిళనాట చర్చలు నడుస్తున్నాయి. అందుకే ఇక్కడ బీజేపీ కూటమికి గెలుపు సులువు కాదు.
* వామపక్షాల పాలనలో కేరళ రాష్ట్రం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. సో.. అక్కడ ఇప్పుడున్న ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత కూడా లేదు. ఈ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ కి కష్టమే. అవినీతి మరకలు లేవు, పైగా ఇటీవల గోల్డ్ స్కామ్ లో కేరళ సీఎం బాగా వ్యవహరించారని పేరు ఉంది.
బీజేపీ ఓడితే మోడీకి చిక్కులు తప్పవా..!?
ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు చూసాం. బీజేపీ ప్రయత్నాలు తెలుసుకున్నాం. ఒకవేళ బీజేపీ ఓడితే ఎవరిదీ బాధ్యత..? ఎవరిదీ ఆ అప్రతిష్ట మోటు అప్పగిస్తారు..!? అనేది కూడా కీలకమే. ఈ విషయాన్నీ లోతుగా చెప్పుకోవాలంటే… మోదీనే కనిపిస్తున్నారు. బీజేపీలో ఎప్పుడూ ఒకే వ్యక్తి ఎక్కువ కాలం శక్తిగా ఉండలేరు. పార్టీని నడిపించలేరు. 1995 నుండి 2004 మధ్య కాలంలో బీజేపీని అద్వానీ – వాజ్పేయి ద్వయం నడిపించింది. 2004 లో ఓడిపోయాక ఈ ద్వయం పక్కకు వెళ్ళిపోయింది. రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ, సుష్మ స్వరాజ్ లాంటి నేతలు వచ్చారు. 2010 నాటికి నరేంద్ర మోడీ రూపంలో బీజేపీకి ఒక పెద్ద శక్తి దొరికింది. 2014 లో బీజేపీ కేంద్రంలో గెలవడానికి కేవలం మోదీనే కారణం. 2019 లో మళ్ళీ గెలవడానికి మోడీ – అమిత్ షా ద్వయం కారణం. ఎక్కువ కలం వీరి హవా నడవకపోవచ్చు. మోడీ ఇప్పుడిప్పుడే కొంత వ్యతిరేకత కూడా మూటగట్టుకుంటున్నారు. ఒకవేళ పైన చెప్పుకున్న రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే మాత్రం “మోడీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఓడిపోయాం” అంటూ బీజేపీలో అంతర్గత చర్చకు అది ఒక విత్తనంలా ఉపయోగపడుతుంది. అప్పుడు బీజేపీలో అంతర్గత పరిణామాలు ఆసక్తికరంగా మారతాయి..! అవేమిటో వచ్చే కథనంలో చెప్పుకుందాం…!!