దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దృష్టి సారించిందనే విషయం తెలిసిందే. పార్టీని బలోపేతం చేయడం, సమర్ధ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం ఇందులో భాగం. తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణలో ఆయన మార్కు చూపిస్తున్నారు. ఏపీలో ఇటివలే సోము వీర్రాజుకు పగ్గాలు అప్పజెప్పింది బీజేపీ అధిష్టానం. అందుకు తగ్గట్టే సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. అయితే.. బీజేపీ జాతీయపార్టీ కావడంతో అన్నిచోట్లా ఒకేలా ఉండాల్సిన నిర్ణయాలు ఒకేలా ఉండటం లేదు. ఇందుకు వినాయకచవితి పండుగ నిదర్శనంగా నిలుస్తోంది.
తెలంగాణలో ఒకలా.. ఏపీలో ఒకలా..
తెలంగాణలో బీజేపీ అధికార పార్టీపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ముందుకెళ్తోంది. మొదటినుంచీ బీజేపీ తెలంగాణలో ఇదే పద్దతి అవలంభిస్తోంది. ఇప్పుడు గణేశ్ చతుర్ది విషయంలో మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతోంది. వినాయకచవితి ఉత్సవాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. రంజాన్ మాసంలో ఇచ్చినట్టే మినహాయింపులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. కేసీఆర్ నిర్ణయాలను కూడా తప్పు బట్టారు. అయితే.. ఏపీలో మాత్రం అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై మరీ అంత ఒత్తిడి తీసుకురాలేదు. మండపానికి, వినాయక నిమజ్జనానికి ఒక రోజు మినహాయింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు విమర్శలు చేస్తూ డిమాండ్ చేస్తే.. ఏపీ అధ్యక్షుడు సానుకూలంగా కోరడం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది.
జాతీయపార్టీ బీజేపీ.. రాష్ట్రాల్లో ఇలా..
రెండు రాష్ట్రొల్లో రాజకీయ ప్రాముఖ్యం వేరు. కానీ.. వినాయకచవితి పండగ నిర్వహణ ఎక్కడైనా ఒకటే. భక్తుల మనోభావాలు ఒక్కటే. అయినా.. తెలంగాణలో ఒక విధంగా, ఏపీలో మరో విధంగా రెండు రాష్ట్రాల అధ్యక్షులు కోరారు. ఇందుకు రాజకీయపరమైన కారణాలు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుంది. ఏపీలో అధికార పార్టీతో కంటే టీడీపీతో బీజేపీకి ఎక్కువ పోరు నడుస్తుంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రాధామ్యాలు వేరు అంటున్నారు. అయితే.. ఈ విషయంలోనే బీజేపీ సిద్ధాంతాలు వేరని చెప్పటానికి లేదు. ఏపీలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం చేయకపోయినా.. 2024లో జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు కలిసి పనిచేస్తున్నామని ధీమాగా చెప్తున్నారు సోము వీర్రాజు.