2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి టిడిపి పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. అధికారంలో ఓ వెలుగు వెలిగిన పార్టీ దాదాపు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే విధంగా స్థానాలు రావటంతో…పార్టీలో చాలా మంది సీనియర్లు స్టార్టింగ్ లోనే ఇతర పార్టీలోకి జంప్ అయిపోవడం తెలిసిందే. పైగా అధికారంలోకి వచ్చిన జగన్ చాలా దూకుడుగా వ్యవహరించడంతో చాలా నియోజకవర్గాలలో నాయకులు క్యాడర్ ని పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉండటంతో టిడిపి క్యాడర్.. పార్టీ పెద్దలకు నియోజకవర్గాల నాయకులు తమను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు మీద ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు ఇటీవల పార్టీ పార్లమెంటరీ అధ్యక్ష పదవులను నియమించి ప్రకటించడం జరిగింది.
అయితే ఈ తరుణంలో చాలావరకు కొత్తవారికి అవకాశం ఇచ్చే రీతిలో వ్యవహరించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా కొత్తగా పార్టీ జిల్లా ఇన్చార్జి పదవులు చేపట్టిన నేతల విషయంలో టిడిపి అనుకూల మీడియా కవరింగ్ చేయడం లేదని పార్టీలో తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం సీనియర్లు మాట్లాడితేనే సదరు మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నట్లు, దీంతో జూనియర్లలో అసహనం నెలకొన్నట్లు టాక్ వస్తోంది. పార్టీలో సీనియర్లను ప్రోత్సహించినట్లు జూనియర్లను కూడా ప్రోత్సహించాలనే డిమాండ్ వినబడుతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికైన నేతలు టీడీపీ అనుకూల ఎలక్ట్రానిక్ మీడియాను పక్కన పెట్టేసి… తమకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎవరికి వారు ప్రచారం చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ విధంగా సీనియర్లు అదే రీతిలో పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో… ప్రజలలోకి వెళ్ళిన మేము ఎవరో తెలియదు అని వారు చెప్పే పరిస్థితి ఉంటుందని కొత్తగా సెలెక్ట్ అయిన జూనియర్లు వ్యాఖ్యానిస్తున్నారట.