సంక్షేమ పథకాలను వరుసగా ఇచ్చేస్తూ… ప్రత్యర్థులను పలుచన చేసేస్తూ… వైసీపీ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటుంది..!
వైసీపీ తప్పులను వర్ణిస్తూ… ఆ నొప్పులను భరిస్తూ … తామే గొప్ప అని చెప్పుకుంటూ… టీడీపీ భవిష్యత్తుపై అనేక ఆశలు పెంచుకుంటుంది…!
టీడీపీ కోరలు పీకేస్తూ.., జగన్ ని జైలు పేరిట బందీ చేస్తూ… జనసేనతో నడుస్తూ… బీజేపీ భావి రాజకీయాలకు అడుగులు వేస్తుంది…!
ఇక అంతేనా..? ఏపీలో మూడు పార్టీలేనా..? కాదు. ముమ్మాటికీ కాదు. నాలుగో పార్టీ ఉంది. వందల ఏళ్ళ చరిత్ర ఉంది. దశాబ్దాల పాటు పాలించిన ఘనత ఉంది. చేసిన పాపాలు అనుభవిస్తూ ఇప్పుడు చచ్చిన పాములా ఉంది ఆ పార్టీ. కానీ చావ ఉంది, లేచి నిరూపించుకునే సత్తా ఉంది, తమ సింబల్ తో మళ్ళీ జనంలోకి వెళ్లే ప్రణాళిక ఉంది. ఆ హస్తానికి ఆ వ్యూహం ఏమిటో, ఆ దిక్కు ఎవరో చూద్దాం..!!
ఆలోచించాల్సిన అంశమే…! ఎందుకంటే…!
కాంగ్రెస్ ఏంటి…? ఏపీలో మళ్ళీ లేవడం ఏంటి..? మీరూ, మీ పిచ్చి రాతలూ అనుకోవద్దు. కొన్ని సీరియస్ ఆలోచనలు, ప్రణాళికలు, అవకాశాలు, బ్యుహాలు అనుసరించి కలిసిన విశ్లేషణ ఇది. కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవడానికి ఉన్న కొన్ని అవకాశాలను పరిశీలిస్తే…!
* జగన్ దగ్గర ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ జగన్ తో పూర్తిగా మనసు విప్పి కలవలేకపోతున్నారు. జగన్ జగనే.., కాంగ్రెస్, కాంగ్రెస్సే…! జగన్ ఆధిపత్యం ఇవ్వడం లేదు, స్వేచ్ఛ ఇవ్వడం లేదు, సీనియారిటీకి గౌరవం ఇవ్వడం లేదు, అసలు లెక్క చేయడం లేదు. అదే కాంగ్రెస్ లో అయితే ఎవరికీ వారే లీడర్లు. ఎవరికీ వారే మంత్రులు, ఎవరికీ వారే బాస్. ఎవరో, ఎప్పుడో జాతీయ పరిశీలకుడు వచ్చినప్పుడు భజన చేసుకుంటే చాలు. అప్పుడప్పుడూ ఢిల్లీ వెళ్లి రాహుల్, సోనియా భజన చాలు. అందుకే ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి లాంటి దాదాపు 60 మంది వైసీపీ నాయకులు మళ్ళీ కాంగ్రెస్ ని లేపితే బాగుంటుంది అనే అంతర్గత యోచనలో ఉన్నారని గుసగుసలు వస్తున్నాయి.
* : “2014 లో టీడీపీ పాలించింది. ప్రత్యేక హోదా తేలేదు. చెప్పుకోదగిన ప్రయోజనాలు లేవు. 2019 నుండి వైసీపీ వచ్చింది. సేమ్ పరిస్థితి. రెండు ప్రాంతీయ పార్టీలు విఫలమయ్యాయి. బీజేపీ కూడా వీటిని వాడుకుంది. అందుకే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్సే మళ్ళీ హోదా ఇస్తుంది. టీడీపీ, వైసీపీ పాలన చూసారు, అందుకే కాంగ్రెస్ కి ఈ సారి అవకాశం ఇవ్వండి అంటూ కీలక నేతలు లేచే అవకాశం ఉంది.”
* “టీడీపీ, వైసీపీకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేదు. బీజేపీకి ఏపీలో పాలన తెలియదు, ఏపీలో వారికి ఓట్లు లేవు. పవన్ తో కలిసి బీజేపీ, బీజేపీతో కలిసి పవనూ కలుషితమయ్యారు. అందుకే కాంగ్రెస్ దిక్కు. మేమె రాష్ట్రాన్ని బాగుచేస్తాం”
* చంద్రబాబు బలహీనమయ్యారు. బీజేపీ, వైసీపీ కంటే బాబు వర్గంలోని కొందరు కీలక నేతలు, ఓ సామజిక వర్గం నేతలు మళ్ళీ కాంగ్రెస్ కి వెళ్లి లేపి, చురుగ్గా రాజకీయాలు చేసే ఉద్దేశంతో ఉన్నారు. వైసీపీ, బీజేపీ కంటే మేమె మంచిది అని చూపించే ప్రయత్నం. అవసరం అయితే ఇక చివరి అంశంగా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, జగన్ ని ఎదుర్కోడానికి కాంగ్రెస్, టీడీపీ జత కట్టినా ఆశ్చర్యం అవసరం లేదు.
ఆ మాజీ సీఎం వస్తున్నట్టేనా..??
ఇక అసలు పాయింట్ కి వచ్చేస్తే…!! కాంగ్రెస్ పైకి లావాలంటే ఏకైక దిక్కు కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే. రాష్ట్ర విభజన కి ముందు, తర్వాత కిరణ్ అనేక దశల్లో ప్రయత్నం చేసారు. విభజనని అడ్డుకునే క్రమంలో కొన్ని నీటి, విద్యుత్తు లెక్కలను చెప్పుకొచ్చారు. దాదాపు అవే ఇప్పుడు నిజమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పెద్దలతో కూడా పోరాడి విభజన ఆపేందుకు విఫలయత్నం చేసారు. అందుకే ఇప్పటికీ నాడు కాంగ్రెస్ లో ఉన్న చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు లాంటి కేంద్ర మంత్రులు కంటే కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎంతో కొంత నమ్మకం ఈ రాష్ట్ర ఓటర్లలో ఉంది. పైగా నాలుగేళ్లు సీఎం గా ఒక్క అవినీతి మారక లేకుండా పని చేశారని పేరుంది. నాటి నుండి కిరణ్ రాజకీయంగా దూరమయ్యారు. జై సమాఖ్యఆంధ్ర పార్టీ పెట్టి విఫలమయ్యారు. కానీ ఆయన పేరు మాత్రం అలాగే ఉంది. అందుకే 2024 లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నట్టు సమాచారం. నాటి కాంగ్రెస్ పెద్దలను మళ్ళీ కలుపుకుని కాంగ్రెస్ కి జీవం పొసే ప్రణాళికలు ఉన్నట్టు సమాచారం. “మేము విభజన చేసాం, మేమె ఆ గాయానికి మందు రాస్తాం. టీడీపీ, వైసీపీ, బీజేపీ కి అవకాశం ఇచ్చారు. మాకు ఇవ్వండి, చూపిస్తాం” అనే ఏకైక అజెండాతో జనంలోకి వెళ్లేందుకు నేతలు సిద్ధమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకు దాదాపు 50 మందికి పైగా మాజీలు, తాజాలు నాటి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచనల్లో ఉన్నారు.