అమరావతి, డిసెంబరు 30 : తెలంగాణా సర్కారును చూసి బంగ్లాదేశ్ ప్రభుత్వం నేర్చుకున్నట్లుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో ఒక న్యూస్ ఛానల్ను కేబుల్ ఆపరేటర్లతో బంద్ చేయించారు. బంగ్లాలో ప్రముఖ న్యూస్ ఛానల్ జమునా టివి ప్రసారాలను అదివారం నిలిపివేశారు. టివి ఛీఫ్ న్యూస్ ఎడిటర్ ఫాహిమ్ అహ్మద్ మాట్లాడుతూ ఛానల్ ప్రసారాలను చేస్తున్నప్పటికీ కేబుల్ ఆపరేటర్లు ఎటువంటి సమాచారం లేకుండా జమునా టివి ప్రసారాలను నిలిపివేశారన్నారు. కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రసారాలను చూడగలుగుతారు. ఈ ఛానల్కు అనుసంధానంగా ఒక పత్రిక కూడా వుంది. రాజకీయ కారణాల నేపధ్యంలో టివి ఛానల్ ప్రసారాలను నిలిపివేసిట్లు ఢాకాలోని కేబుల్ ఆపరేటర్లు తెలిపారు.
బంగ్లా మీడియాలో ఇప్పటికే ప్రముఖ మీడియా ఫొటో గ్రాఫర్ షాహిదుల్ ఆలమ్ ఫేస్బుక్లోని తనఖాతాలో ప్రధానికి వ్యతిరేకంగా కామెంట్ చేసినందుకు వేటుపడింది. అధికారపార్టీకి వ్యతిరేకంగా వార్తలను ప్రచురించినందుకు ప్రముఖ దినపత్రికల్లోని ఇరువురు ఎడిటర్లు తమ ఉద్యోగాలను పోగొట్టుకొని, పరువునష్టం కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రధాని హసీనా దేశంలో డిజిటల్ సెక్యూరిటీ చట్టాన్ని మరింత కఠినతరం చేశారు. ఈ చట్టం వల్ల పరిశోధనాత్మక జర్నలిజానికి సంకెళ్లు పడతాయని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
previous post
next post