విజయవాడ, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఏ ప్రధాన మంత్రులు ఇవ్వనంత సాయం మోదీ అందించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియం నందు సోమవారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందించిన సాయంలో ఎమైనా అనుమానాలు ఉంటే లెక్కలతో సహా చెప్పడానికి తాము సిద్ధమని గడ్కరీ సవాల్ విసిరారు. కేవలం రోడ్లు, పోర్టుల నిర్మాణానికి తన శాఖ నుండే ఆంధ్రప్రదేశ్కు 25వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం ఖర్చు కేంద్రమే భరిస్తుందని అన్నారు. ఇప్పటి వరకూ 62శాతం పనులకు నిధులు మంజూరు చేశామని గడ్కరీ చెప్పారు.
అనంతపురం – అమరావతి హైవే నిర్మాణానికి 20వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ – చెన్నై పారిశ్రామిక క్యారిడార్ను కూడా పూర్తి చేస్తామని గడ్కరీ అన్నారు. కాకినాడలో పెట్రో కెమికల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా సుపరిపాలన అందించాలన్నది మోదీ లక్ష్యమని అన్నారు. కేంద్రం ఎంత సాయం చేస్తున్నా రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి చేయడం లేదంటూ దుష్ప్ర చారం చేస్తున్నారని గడ్కరీ విమర్శించారు.
బిజెపి కుటుంబ పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ అని పేర్కొన్నారు. బిజెపియేతర పార్టీల హయాంలో దేశంలో టెర్రరిజం పెరిగిపోయిందనీ, మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా అదుపులోకి వచ్చిందని గడ్కరీ అన్నారు. ఈబిసి రిజర్వేషన్ కల్పించినందుకు గడ్కరీని రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.