Corona: దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి కరోనా కట్టడి చేయటం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రస్తుతం సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభణ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రమాదకరమైన రకరకాల వైరస్ కేసులు ఏవైతే బయటపడుతున్నాయో..అటువంటి ప్రమాదకరమైన కేసులు నిజామాబాద్ జిల్లాలో గత పది రోజుల నుంచి బయట పడుతున్నట్లు అక్కడ వైద్యులు తెలియజేస్తున్నారు.
దీంతో జిల్లా వ్యాప్తంగా శరవేగంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామంతో జిల్లా ఆసుపత్రులలో కరోనా పేషెంట్ లతో పడకలు నిండిపోతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ దగ్గరగా ఉండే మహారాష్ట్రలోని నాందేడ్ మార్కెట్ నుండి రాకపోకలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఎక్కువ అయినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో జిల్లా సరిహద్దులలో ప్రభుత్వ అధికారులు ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నాందేడ్ నుండి ఎవరైతే నిజామాబాదులో కి వస్తున్నారో వారిలో దాదాపు పది మందిలో ఆరుగురికి పాజిటివ్ రిపోర్టులు వస్తున్నట్లు తెలంగాణ వైద్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో ఇప్పుడు నిజామాబాదు జిల్లా కరోనా పాజిటివ్ కేసులతో వణికిపోతున్న పరిస్థితి. మహారాష్ట్ర రాష్ట్రానికి ఈ జిల్లా దగ్గరగా ఉండటంతో ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ డౌన్ అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో ..ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలలో కేసుల సంఖ్య తగ్గటం గ్యారెంటీ అని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.