నిజామాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన రైతులు నేడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోది పోటీ చేస్తున్న వారణాశి లోక్సభ స్థానంలో నామినేషన్లు దాఖలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు ‘చలో వారణాసి’ కార్యక్రమం చేపట్టారు.
నిజామాబాద్ జిల్లాలోని అర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తున్నామని రైతులు చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులుగా వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తామని తెలిపారు. పసుపు బోర్డుతో పాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామనీ, ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించబోమని వెల్లడించారు.
నిజామాబాద్లో పోటీ వ్యవహారాన్ని బిజెపి, కాంగ్రెస్లు రాజకీయంగా వాడుకున్నాయని రైతులు ఆరోపించారు. నిజామాబాద్ ఎంపి కవితను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయడం వల్ల తమ సమస్య పక్కదారి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు మద్దతుగా తమిళనాడు నుంచి రైతులు వస్తున్నారనీ, ఇతర రైతులు తరలి రావాలనీ వీరు విజ్ఞప్తి చేశారు.
పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరలను పెంచాలని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని రైతులు గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ, పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరిలో రహదారులపై బైఠాయించారు. రోడ్లను దిగ్బంధం చేశారు. వంటావార్పు చేపట్టారు. చలో అసెంబ్లీకి పిలుపునిస్తే పోలీసులు అడ్డుకొన్నారు.
ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవటంతో ఎన్నికల్లో మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేసి నిరసన తెలియజేశారు. మొత్తంగా 185 మంది రైతులు బరిలో నిలవడం సర్వత్రా చర్చనీయాంశమైనది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?