“ఇవాళ మిస్సయినా నిన్ను వదిలి పెట్టను”అని ఒక అధికార పార్టీ ఎంపీకి ఆయన స్వగ్రామంలోనూ అది ఆయన ఇంటి ఎదుటే ఒక సామాన్య వ్యక్తి హెచ్చరించిన సంఘటన చూస్తే ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది అద్దంలో కనిపిస్తుంది.బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ బాబుపై గురువారం రాత్రి జరిగిన దాడి యత్నం సంచలనంగా మారింది.
ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడయిన సురేష్ బాబుపై ఇప్పటికే రెండు మూడు సార్లు దాడి ప్రయత్నాలు జరిగాయి .తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఎంపీ నివాసం వద్దే మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో నుంచి ఆయన బయటకు ఎంపీ వాహనానికి బైక్ ను అడ్డుగా పెట్టాడు. అనంతరం రాడ్ తో దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు.దీంతో స్పందించిన గన్ మెన్లు వెంటనే స్పందించి నిందితుడ్ని అడ్డుకోవటంతో పెనుప్రమాదం తృటిలో తప్పింది. తదుపరి అతను పారిపోయి ఇదే గ్రామంలోని ఒక అమరావతి జేఏసీ నేత ఇంట్లో దాకొనగా పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనతో ఎంపీ కూడా షాక్ తిన్నట్లు కనిపించారు. పూర్ణచంద్రరావు ఇదే గ్రామానికి చెందిన వారైనప్పటికీ గత కొన్నేళ్లుగా మందడం గ్రామంలో ఉంటున్నాడని ఇప్పుడు అకస్మాత్తుగా ఊర్లోకి వచ్చి ఈ దాడికి ప్రయత్నిం చాడని సురేష్బాబు శుక్రవారం మీడియాకు చెప్పారు.
ఈ దాడి వెనుక టిడిపి హస్తమే కాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రోద్బలం ఉందనేది ఏ మాత్రం అనుమానం లేని విషయం అన్నారు. తన మీద దాడికి ప్రయత్నించిన పూర్ణచంద్రరావు ‘పోలీసులు పట్టుకుంటే గంటలో బయట కొస్తా… కోర్టుకి పంపిస్తే ఒక రోజులో వచ్చేస్తా..ఈ రోజు మిస్సయినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు”అని సవాల్ విసిరి వెళ్లాడంటే అతని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చునని ఎంపీ వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సామాజిక వర్గం వారు తప్ప మరొకరు ఉండకూడదన్న రీతిలో వారి వ్యవహారశైలి ఉందని ఇదే ప్రాంతానికి చెందిన దళితుడైన తాను ఎంపీ కావటం వారు జీర్ణించుకోలేక న్నారని అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని సురేష్ బాబు చెప్పారు.ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుడు ఆ సామాజిక వర్గం చేతిలో విలవిల్లాడాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తాను ఇలాంటి బెదిరింపులకు, దాడులకు భయపడే రకం కాదని దేనికైనా సిద్ధంగానే ఉన్నానని ఎంపీ సురేష్ బాబు ఉద్ఘాటించారు.