టిడిపి కి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు గోడ దూకేశారు. మరికొందరు కూడా అదే లైన్లో ఉన్నారని సమాచారం. ఇక ఎంపీల విషయానికొస్తే టిడిపి తరపున గెలిచింది ముగ్గురే!వారు కూడా మూడు దారుల్లో పయనిస్తునారట.టిడిపి ఎంపీలు ఎవరికి వారే తమ రాజకీయ గమ్యాన్ని వెతుక్కుంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు.మొన్నటి ఎన్నికల్లో విజయవాడలో కేసినేని నాని గుంటూరులో గల్లా జయదేవ్ శ్రీకాకుళంలో కింజరపు రామ్మోహన్ నాయుడు జగన్ ప్రభంజనాన్ని అడ్డుకుని టిడిపి ఎంపీలుగా గెలవడం తెలిసిందే!అయితే ఈ ముగ్గురికి చంద్రబాబుపై గురి కుదరడం లేదట. విజయవాడ ఎంపీ కేశినేని నాని గతంలోనే చంద్రబాబుపై ట్విట్టర్లో యుద్ధం ప్రకటించారు. అధినేత చెప్పుడు మాటలు వింటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నాని. అయితే ఆ తర్వాత ఆయన సర్దుకు పోయినట్లు కనిపించినప్పటికీ లోలోన కేశినేని నాని వేరే యోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.బిజెపికి కేశినేని దగ్గరగానే మెలుగుతున్నారు అంటున్నారు.
ఇక రామ్మోహన్నాయుడు అంటే లోకేశ్ కి అస్సలు పడదు.ఈనేపథ్యంలో తనను పార్టీ చిన్నచూపు చూస్తోందని రామ్మోహన్నాయుడు రగిలిపోతున్నాడట.ఇప్పటికైతే రామ్మోహన్ నాయుడు టిడిపిలో టచ్ మీ నాట్ గా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ టిడిపిని వీడితే ఏ పార్టీలో కి వెళ్లాలన్నదే రామ్మోహన్ నాయుడు మీమాంస అట.చివరగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విషయానికొస్తే ఆయన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి.. టీడీపీ పోలిట్ బ్యూరో పదవికి తాజాగా రాజీనామా చేయడం గమనార్హం .వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేశానని చెబుతున్నా.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చకే ఆమె పోలిట్ బ్యూరో పదవిని వదులుకున్నారనేది ఓపెన్ సీక్రెట్.
అంతేకాదు ..కుమారుడు గల్లా జయదేవ్ కి తెలియకుండా గల్లా అరుణ అంత పెద్ద నిర్ణయం తీసుకోరంటున్నారు.తల్లీ కొడుకులు మాట్లాడుకునే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారంటున్నారు.గల్లా అరుణ టిడిపిలో కీలక పదవి వదులుకున్న నేపథ్యంలో జయదేవ్ కూడా ఆ పార్టీ లో మూటాముల్లె సర్దుకున్నట్లు గానే భావిస్తున్నారు.అతి త్వరలో ఈ ముగ్గురిలో ఒక ఎంపీ అయితే మాత్రం టిడిపికి విడాకులివ్వడం ఖాయమని రాజకీయ పరిశీలకులు బల్లగుద్ది చెబుతున్నారు.అది ఎవరన్నదే ఇప్పుడు టిడిపిలో కూడా చర్చనీయాంశం!