Note for Vote : ఓటుకు నోటు Note for Vote కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2015 మే 30వ తేదీన జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అప్పటికి ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు పేరు ఈ కేసులో ఉండటం మరింత సంచలనం రేపింది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మద్దతు కోరుతూ అప్పటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అప్పటినుంచీ ఈ కేసుపై ఏసీబీ ప్రత్యేక కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా స్టీఫెన్ సన్ ఏసీబీ కోర్టులో విచారణ నిమిత్తం హాజరయ్యారు.
తనతో చంద్రబాబు మొబైల్ ఫోన్లో మాట్లాడటం నిజమేనని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. మనవాళ్లు అంతా బ్రీఫ్ చేసినట్టు చెప్పారని.. వాళ్లు చెప్పినట్టు చేయాలనీ.. మిగిలిన విషయాలు తాను చూసుకుంటానని చెప్పినట్టు కోర్టుకు తెలిపారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని కోరారని కూడా చెప్పారు. మరికొందరి వాదనలు కూడా విన్న కోర్టు ఈ కేసును ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. ఈ కేసులో ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయసింహ తదితరులను విచారించడం, రిమాండ్ కు పంపడం.. వాళ్లు బెయిల్ పై బయటకు రావడం కూడా జరిగింది. అయితే.. ఇన్నేళ్లుగా ఈ కేసులో చంద్రబాబు నాయుడును కోర్టు ఇంతవరకూ విచారణకు పిలవలేదు.
తన ప్రమేయం లేదని గతంలో చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే.. ఈ కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని ఏసీబీ గతంలోనే తేల్చింది. చంద్రబాబు-స్టీఫెన్ సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కూడా పూణెలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నిజమేనని తేల్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏసీబీ చెప్పిన విషయం నిజమేనని పలుమార్లు గతంలో చెప్పారు కూడా. అయినా.. ఈ కేసులో విచారణకు సబంధమున్న ప్రతిఒక్కరినీ పిలిచి విచారించింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో వివరణ ఇవ్వాల్సిన వారిలో చంద్రబాబు ఉన్నారు. మరి.. నిన్న స్టీఫెన్ సన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈనెల 7న ఏసీబీ కోర్టు ఏం తేలుస్తుందో చూడాలి.