NT Rama Rao: నందమూరి తారక రామారావు.. NT Rama Rao.. అనే వ్యక్తి.. తెలుగు నేలపై ఓ శక్తిగా ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. అందుకే ఆయన తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అయ్యారు. ‘ఎన్టీవోడు’గా జనం గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు.. ఇలానే ఉండేవారా.. అనిపించారు. రాజకీయాల్లో కూడా ఆయన శకం కొనసాగింది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగు ప్రజలతో ‘అన్నా..’ అని పిలిపించుకున్నారు. ఆయన స్థాపించిన పార్టీ దినదిన ప్రవర్ధమానమైంది. ఇంత చేసిన ఎన్టీఆర్ కు దేశపు అత్యున్నత పురస్కారం దక్కకపోవడం ఎప్పుడూ వార్తల్లో నిలిచే అంశం. ఎన్టీఆర్ ఇందుకు అర్హుడు కాదా?
పంచెకట్టు కట్టి తెలుగుదనం అంటే ఏంటో చూపించారు. భక్తి, పౌరాణికం, జానపదం, సాంఘీక చిత్రాలెన్నింటిలోనో నటించారు. ఆయనలో ప్రజలు దేవుడినే చూసుకున్నారు. చిరస్మరణీయ పాత్రలెన్నో ధరించి.. ప్రజలను అలరించడంలో ఆయన కృతార్థుడు అయ్యారు. అనంతరం ప్రజలను పాలించేందుకు సిద్ధమై పార్టీ పెట్టి దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లోనే అధికారం చేపట్టారు. తక్కువ సమయంలో ఇంతటి ఘనత సాధించిన పార్టీ లేదు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పాత వ్యవస్థలను తొలగించి కొత్త వ్యవస్థలను తీసుకొచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో చాలా రాష్ట్రాలు అమల్లోకి తెచ్చాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ డిమాండు ఊపందుకున్నా తర్వాత నీరుగారిపోయింది.
Read More: NT Rama Rao: ఎన్టీఆర్ ప్రస్థానం..! తెలుగోడు.. ఎన్టీవోడు.. కారణజన్ముడు..
1954 నుంచీ ఇస్తున్న భారతరత్న అవార్డులు స్వీకరించినవారిలో విదేశీయులు కూడా ఉన్నారు. చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ ను మాత్రం దేశం ఓ రత్నంగా గుర్తించడంలో విఫలమైంది. పీవీ నరసింహారావు, పింగళి వెంకయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. వంటి మహనీయులకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ను కూడా కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎంఎస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్, పండిట్ రవిశంకర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, పండిట్ భీంసేన్ జోషి.. వంటివారు తమ రంగాల్లో అందించిన విశేష సేవలకు అత్యున్నత పురస్కారం దక్కింది. ఎన్టీఆర్ కూడా.. 300 పైచిలుకు సినిమాలు, స్టూడియో, చిత్ర నిర్మాణం, రాజకీయ పార్టీ, సంక్షేమ పథకాలు.. ఇలా ఎంతో చేశారు. ఇకనైనా.. ఎన్టీఆర్ కళాసేవ, ప్రజాసేవను గుర్తించైనా ‘భారతరత్న’ వరిస్తుందని ఆశిద్దాం.