టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత ఇష్టమైన ‘వ్యాపకం..’ అంటే పార్టీ మీటింగ్స్, పాలిట్ బ్యూరో సమావేశాలు, టెలీకాన్ఫరెన్సులు.. ఇప్పుడు కొత్తగా జూమ్ ద్వారా వర్చువల్ కాన్ఫరెన్సులు. ఇటివలే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన చంద్రబాబు.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నేరుగా విజయనగరం జిల్లా రామతీర్ధం వెళ్లారు. అక్కడి నుంచి వచ్చి మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో పొలిట్బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. సహజంగానే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వంపై విమర్శలు తప్పించి మరేమీ ఉండదని ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు.
ప్రభుత్వాన్ని నిలదీయడం ఎలా..?
19 నెలల కాలంలో 16 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు, విమర్శలు చేశారు. చంద్రబాబు కూడా ప్రభుత్వ తీరును తప్పుబడుతూనే ఎలా ఎదురుదాడి చేయాలో చర్చించారు. ఎమ్మెల్సీ, తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికపై చర్చించారు. జగన్ హయాంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలు, వ్యవస్థల విధ్వంసం, ప్రకృతి వైపరీత్యాలు, అన్నదాతలను ఆదుకోవటంలో వైఫల్యం, శాంతి భద్రతలు, ప్రజల రక్షణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై దాడులు, దేవాలయాలపై దాడులు.. అనే అంశాలపై చర్చించారు. పనిలో పనిగా అమరావతి పరిరక్షణ, ప్రభుత్వ వైఫల్యాలు, ఇళ్ల పట్టాల పంపిణీ, భూసేకరణలో అవినీతి, పోలవరం భూసేకరణ.. ఇలా జగన్ ప్రభుత్వంపై కొనసాగించాల్సిన దాడిపైనే ప్రధానంగా చర్చించారు.
మరి.. పార్టీ పరిస్థితిపై బాబు ఏం మాట్లాడారో..!
2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నాటి నుంచి ప్రభుత్వంపై విమర్శలే కాకుండా.. ప్రజా సమస్యలపై గళమెత్తుతోంది. ప్రతి సమావేశం, సమీక్షలో ప్రభుత్వంపై విమర్శలు.. తాము మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అనేట్టుగా టీడీపీ అధినేత ప్రసంగాలు సాగాయి. కానీ.. టీడీపీ సంస్థాగత నిర్మాణంపై పెద్దగా చర్చించింది లేదు. భవిష్యత్ కార్యాచరణ అంటూ పోరాటాలు చేయాలనే జరుగుతుంది. చంద్రబాబు ఎంతగా తాపత్రయపడుతున్నా.. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏమంత బాగాలేదని ఎవరైనా చెప్పేమాట. ‘మేమున్నాం.. గుర్తించండి’ అని చెప్పుకోవడానికే తప్పించి ప్రస్తుతం టీడీపీ చేస్తోందేమీ లేదని చెప్పాలి. వాస్తవంగా.. ఏపీలో టీడీపీ ప్రస్తుత పరిస్థితి అదే. 175 నియోజకవర్గాల్లో ఇంచార్జులు లేని పరిస్థితి. యువతకు ప్రాధాన్యం ఇవ్వని వైనం. లోకేశ్ పై ఎవరికీ నమ్మకం లేదు. గతంలో లోకేశ్ కు సీనియర్లకు పొసగడం లేదనే వార్తలనూ కొట్టివేయలేం. లోకేశ్ వ్యాఖ్యలను ఇప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోని సందర్భాలే ఎక్కువ. ఆ ముద్ర నుంచి లోకేశ్ తనకు తానుగా కాకుండా.. చంద్రబాబే బయట పడేయాల్సిన పరిస్థితి. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చే నాయకులు టీడీపీలో లేకపోవడం పార్టీకి మైనస్.
జూ.. ఎన్టీఆరే దిక్కా..? చంద్రబాబు-లోకేశ్ పరిస్థితేంటి..?
మొన్నిటికి మొన్న.. ‘2024లో ఏపీ సీఎం ఎన్టీఆర్’ అనే బ్యానర్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తే.. చంద్రబాబు, లోకేశ్ గుండెలు అదిరిపోయాయని చెప్పాలి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ఈ బ్యానర్ భవిష్యత్ లో పార్టీకి దిక్కెవరు? అనే ప్రశ్నకు సమాధానం వచ్చినట్టైంది. అంటే జూ.. ఎన్టీఆర్ ఫొటోనే కనిపిస్తోంది.. అందరికీ. చంద్రబాబు వయసు 70.. పార్టీలో చాలామంది దాదాపు 55 ఏళ్లకు పైబడ్డవారే. తెలంగాణలో టీడీపీని చూసి ఎంతలేదన్నా ఏపీలో పార్టీ భవిష్యత్ పై ఆందోళన సహజమే. టీడీపీ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. ఎవరుంటారో తెలీదు. ఈ సమయంలో పార్టీ బలోపేతంపైనే చంద్రబాబు ఫోకస్ చేయాల్సి ఉంది. అచ్చెన్నాయుడికి పగ్గాలు అప్పజెప్పినా స్టాండప్ అండ్ సిట్ టైపే. తన ఊకదంపుడు ఉపన్యాసాలకు కాలం చెల్లిందని చంద్రబాబు గుర్తించాలి. జగన్ పై విమర్శలు, ప్రభుత్వాన్ని ఢీ కొట్టాలనే ఆలోచనలకు ఇప్పటికైనా చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టాలి. కనీసం.. పవన్ కల్యాణ్ లా సూటిపోటి డైలాగులు, కౌంటర్లు వేసే నాయకులను తయారు చేసుకోవడమే చంద్రబాబు తక్షణ కర్తవ్యం..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?