Congress G23: కాంగ్రెస్ G23..Congress G23 2019లో టీడీపీకి చుక్కలు చూపించిన 23 సంఖ్య ఇప్పుడు కాంగ్రెస్ కు కూడా చూపిస్తోంది. కాంగ్రెస్ జీ23 ప్రస్తుతం గాంధీ కుటుంబాన్ని కలచివేస్తోంది. అసలే దేశవ్యాప్తంగా కుదేలైన కాంగ్రెస్ కు ఇప్పుడు జీ23 గా పిలవబడే సీనియర్లు కాంగ్రెస్ పై దాదాపు తిరుగుబాటు ధోరణి కనబరుస్తున్నారు. ఇటివల రాజ్యసభ ఎంపీగా గులాంనబీ ఆజాద్ ను కొనసాగించకుండా కాంగ్రెస్ చేసిన పని ఇప్పుడు అధిష్టానానికి చుట్టుకుంటోంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రచారాన్ని తమ భుజాలపై వేసుకున్న రాహుల్ – ప్రియాంకలకు ఇది మింగుడుపడని అంశం. అందుకే వారి ప్రచారంలో జీ-23 అంశాన్ని ప్రస్తావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై పదునైన విమర్శలు, వాగ్భాణాలు సంధిస్తున్నారు.
గులాంనబీ ఆజాద్ రాజ్యసభ ఎంపీగా పదవీకాలం ముగిసిన రోజున ప్రధాని మోదీ ఆయన్ను పొగడటం చర్చనీయాంశంగా మారింది. ఆజాద్ కూడా మోదీతో తనకు ఎప్పటినుంచో స్నేహం అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ వర్గాలను విస్మయపరచాయి. కాంగ్రెస్ ముసుగులో బీజేపీకి మద్దతిస్తున్నారా..? అనే వ్యాఖ్యలూ వచ్చాయి. ఇటివల జమ్మూలో జరిగిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అనే ప్రభుత్వేతర సంస్థ శాంతి సమ్మేళన్ లో కపిల్ సిబల్ సైతం కాంగ్రెస్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అజాద్ పై కాంగ్రెస్ నిర్ణయం సరికాదనే వాదనా వచ్చింది. ఇప్పటినుంచి మేల్కొనకపోతే వచ్చే 2024 పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడదనేది వారి ఉద్దేశం.
ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తున్న సోనియాగాంధీ సైతం మిన్నకుండిపోతున్నారు. కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ కే పట్టం కట్టాలని భావిస్తున్న తరుణంలో పార్టీ సీనియర్లు 23 మంది నుంచి వ్యతిరేకత వస్తోంది. వీరి మాటల్లో కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ కు ఇవ్వడం వారికి ఇష్టం లేదనే అర్ధమే వస్తోంది. సోనియా వయోభారం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో పార్టీని బతికించాలని సోనియా, రాహుల్, ప్రియాంక ఓవైపు.. పార్టీ సీనియర్లు ఓవైపు తాపత్రయపడుతున్నారు. సోనియా కుటుంబం మాత్రం జీ-23 నేతలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఏ తీరం దాటుతుందో చూడాల్సి ఉంది.