ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు సమన్వయంతో ప్రజల కోసం పని చేయాలి. వీరి మధ్య సమన్వయం, సఖ్యత లేకపోతే ఆ శాఖ పనితీరు గాడి తప్పుతుంది. మంత్రులుగా తీసుకునే నిర్ణయాలను లోటుపాట్లు చూసి అధికారులు అమలు పరుస్తారు. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి ఏకంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నే బూతులు తిట్టారు. అది కూడా ఓ ఫోన్ సంభాషణలో. ఆ వాయిస్ కాస్తా బయటకు వచ్చింది. దీంతో అరిటాకు ముల్లు సామెతలా మారిపోయింది ఆ ఉన్నతాధికారి పరిస్థితి. బుధవారం ఆయనకు హూటాహుటిన ట్రాన్స్ ఫర్ అందింది. అసలేం జరిగింది..
ఆ ఉన్నతాధికారి చుట్టూ వివాదాలేనా..
జీహెచ్ఎంసీ పరిధిలో గోషామహల్ సర్కిల్ 14లో ఇన్ చార్జి డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్నారు వినయ్ కుమార్. గతంలో వివిధ హోదాల్లో పని చేసిన వినయ్ కుమార్ 18 నెలల క్రితమే ఇన్ చార్జి డీసీపీగా విధుల్లో చేరారు. అప్పటినుంచీ కిందిస్థాయి సిబ్బందితో ఆయన వ్యవహారశైలిపై వివాదాలు వస్తూనే ఉన్నాయి. కమిషనర్ కు ఫిర్యాదులూ వెళ్లాయి. అదే తీరును మంత్రిపై కూడా చూపించారు. ఇటివలి భారీ వర్షాల నేపథ్యంలో గోషామహల్ ప్రాంతంలో మంత్రి తలసాని పర్యటించి బాధితులకు అందాల్సిన సాయంపై ఆదేశాలిచ్చారు. అయితే.. ఈ విషయమై గన్ ఫౌండ్రీ మహిళా కార్పొరేటర్ కు వినయ్ కుమార్ కు మధ్య వాదనలు, గొడవ జరిగాయి. దీనిపై ఆమె మంత్రికి ఫిర్యాదు చేశారు.
మంత్రి తలచుకుంటే జరిగేది ఇదే..
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లిస్టు తనకెందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజా సింగ్ వినయ్ కుమార్ కు ఫోన్ చేశారు. ఈ సమయంలో మంత్రి, కార్పొరేటర్ ను ఫోన్లో దూనమాడారు. అసభ్య పదజాలంతో, బండ బూతులు తిట్టారని సమాచారం. ఈ ఆడియో లీక్ కావడం.. మంత్రి వద్దకు చేరడం జరిగిపోయాయి. దీంతో ఆయనపై బదిలీ వేటు పడింది. ఈ ఆడియో టేప్ తో పరువు పోతుందనే ఉద్దేశంతో బయటకు రానివ్వకుండా మంత్రి మేనేజ్ చేశారని తెలుస్తోంది. నోటి దురుసు వల్ల వచ్చే ఫలితమేంటో ఈ ఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది.