మైన్ పురి: ములాయం సింగ్ యాదవ్ – మాయావతి.. యూపీ రాజకీయాల్లో ఇద్దరూ పాతికేళ్ల నుంచి బద్ధ శత్రువులు. అలాంటివాళ్లు ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తున్నారు. అత్తా అల్లుళ్ల పొత్తు (మాయ-అఖిలేశ్) సత్ఫలితాలు ఇవ్వడంతో సార్వత్రిక ఎన్నికలలో సమాజ్ వాదీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీని ఓడించేందుకు చేతులు కలిపాయి. దాంతో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి మైన్ పురి నగరంలో నిర్వహించే ప్రచారసభలో ఒకే వేదికపై కలిసి పాల్గొంటున్నారు. పాతికేళ్లుగా ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టి మరీ వారు చేతులు కలుపుతున్నారు. ఇందుకోసం క్రిస్టియన్ ఫీల్డ్ పూర్తిస్థాయిలో ముస్తాబైంది.
1995లో రెండు పార్టీల మధ్య పొత్తు కాస్తా చిత్తవడంతో అప్పటినుంచి ములాయం, మాయావతి కనీసం ఒకరినొకరు చూసుకోడానికి, పలకరించుకోడానికి కూడా ఇష్టపడలేదు. స్టేట్ గెస్ట్ హౌస్ లో మాయావతి ఉన్నప్పుడు, అక్కడకొచ్చిన ఎస్పీ కార్యకర్తలను బీఎస్పీ కార్యకర్తలు కొట్టడంతో వివాదం మొదలైంది. దాంతో ములాయం మాయావతి సర్కారుకు మద్దతు ఉపసంహరించుకుని బీజేపీతో చేతులు కలిపారు. అప్పటి నుంచి ఉన్న విభేదాన్ని ఒక్కసారిగా తప్పించడం ములాయంకు అంత సులభం కాలేదు. దాంతో అనారోగ్యం వంకతో దేవ్ బంద్, బదయూ, ఆగ్రా ర్యాలీలకు ఆయన డుమ్మాకొట్టారు.
కానీ పార్టీ అధ్యక్షుడు, తన కొడుకు అఖిలేశ్ పట్టుబట్టడంతో మాయావతితో వేదిక పంచుకోడానికి అంగీకరించారు. ఈ సభలో రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ కూడా పాల్గొంటున్నారు. సభకు వచ్చే 35 వేల మందికి పైగా ప్రజలకు ఆహార పొట్లాలు కూడా అందిస్తున్నామని, ములాయం మధ్యాహ్నానికి వస్తారని పార్టీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తు మూడునాళ్ల ముచ్చటేనని బీజేపీ విమర్శిస్తుండగా.. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని మాయావతి, అఖిలేశ్ తమ కార్యకర్తలకు చెబుతున్నారు.