హైదరాబాద్, జనవరి7: తెలంగాణలో కాంగ్రెస్ ఓటమితో నాయకుల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్కు గురి అయిన ఆపార్టీ సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ దళితుడినయినా జనరల్ సీట్లో గెలిచానని గుర్తు చేశారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ ‘నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసే అధికారం ఉత్తమ్కు, కుంతియాకు ఎక్కడిది. నాపై చర్యలు తీసుకోవాలంటే అధిష్టానం తీసుకోవాలి ’ అని సర్వే అన్నారు. ఉత్తమ్, కుంతియాలు టికెట్లు అమ్ముకున్నారనీ, టికెట్లు అమ్ముకున్న వారే మళ్లీ ఓటమిపై సమీక్ష చేస్తున్నారంటూ సర్వే విమర్శించారు. ప్రశ్నిస్తే పార్టీ నుండి తొలగిస్తారా అని అన్నారు.
తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాననీ, సోనియా గాంధీ దగ్గరే చస్తానని సర్వే అన్నారు.
పార్టీ పంపిన డబ్బులు ఏమయ్యాయని ఉత్తమ్, కుంతియాలను సర్వే ప్రశ్నించారు. భట్టి విక్రమార్కను, తనను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయని సత్యనారాయణ తెలిపారు. విజయం సాధించిన కేసీఆర్ రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కష్టపడుతున్నారని ఆయన అన్నారు. ఓడిపోయిన ఉత్తమ్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి కష్టపడకుండా అసెంబ్లీ ఓటమి రివ్యూలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు