ఎవరేమన్నా…. తమిళనాడు రాజకీయాల గురించి మనకి పెద్ద అవగాహన లేకపోయినా…. వారి గురించి చిన్న సమాచారం తెలిసినా సరే… అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అసలు వారి రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే కొనసాగుతూ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాన్ని శాసించే క్రమంలో నేతలు క్రమశిక్షణ తప్పితే మాత్రం వేటు తప్పదు. జయలలిత, కరుణానిధి ఉన్న సమయంలో దశాబ్దకాలంలో పార్టీ నేతలు కనీసం గీత దాటిన దాఖలాలు లేవు. మరి అంతటి ఘన చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీలపై బిజెపి తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తోంది. మరి మోడీ-షా పాచికలు అక్కడ పారుతాయి అంటారా? అసలు వారి రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు పొంతన ఏమిటి?
అది సరిగ్గా ఏడిస్తే ఈ బాధలేందుకు?
కరుణానిధి జయలలిత ల మరణం తర్వాత ఆయా పార్టీలను సమర్థవంతంగా నడిపించే నాయకుడు కనపడట్లేదు. ముఖ్యంగా డీఎంకే పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉంది. స్టాలిన్ మంచి నాయకుడు అయినా నేతలను కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతాడు. ఇక ఏపీ రాజకీయాలలో అదే పాత్రలో చంద్రబాబు ఉన్నారు. పెద్దన్న ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత పార్టీని నిలబెట్టగలిగినా… రాష్ట్రాన్ని ఏకగ్రీవంగా శాసించే స్థాయి ని అందుకోలేకపోయాడు. ఇతర ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి మడుగులు ఒత్తుతూ ఇస్తూ అస్తవ్యస్త రాజకీయం కొనసాగిస్తున్నాడు. మరి పాగా వేసేందుకు ఇంతకన్నా ఇంకేం కావాలి…?
ఎక్కువ మాట్లాడితే ఎదురుతిరుగుడే….
కరుణానిధి, జయలలితల మరణం తర్వాత డీఎంకేలో అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ ను ధిక్కరించారు. నాయకత్వాన్ని ప్రశ్నించారు. వీరిపై అనర్హత వేటు వేసినా కూడా తిరిగి ఉప ఎన్నికల్లో అన్నాడిఎంకె ఆ సీట్లను దక్కించుకోలేకపోయింది. ఇక ఏపీ రాష్ట్రం విషయానికి వస్తే టిడిపి నుండి ఇప్పటికే ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు అదే కోవకు చెంది ఉన్నారు. ఇక వైసీపీలో రఘురామరాజు చేస్తున్న రచ్చ అందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో తమిళనాడు రాజకీయాలు ఏపీ రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే బిజెపి అక్కడ ఇక్కడ ట్రయల్స్ వేస్తూ ఉంది.
ఇక కచ్చితంగా చెప్పాలి అంటే….
బిజెపి గత పార్లమెంటు ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత ప్రాంతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలపై గట్టిగానే కన్నువేసి ఉంది. అందుకు తగ్గట్లు ప్రతి చోటు తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ ముందుకు పోతుంది. అది ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు ఎక్కడైనా రాజకీయాలు రాజకీయాలే. కానీ తమిళనాడులో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తమ వ్యూహాలను ఏపీతో దగ్గరి సంబంధాలు ఉన్న ఈ దక్షిణాది రాష్ట్రంలో ముందు అమలు చేసి ఆ ఫలితాన్ని బట్టి ఏపీలో నడుచుకోవాలి అన్నది బీజేపీ ప్లాన్. మరి చివరికి ఎక్కడ ఎవరు పై చేయి సాధిస్తారు..?