Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు Chandrababu Naidu గతంలోనే కాదు.. ఇప్పుడు టీడీపీ నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్ తరహాలో చంద్రబాబు మాస్ లీడర్ కాదు. కానీ.. ఆయన తప్పితే టీడీపీ నుంచి నాయకుడు కరువయ్యాడనే చెప్పాలి. పార్టీని ఒక్క తాటిపై నడిపించాలన్నా.. ప్రజల్లోకి వెళ్లాలన్నా, పార్టీ వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా చంద్రబాబు ఇప్పటికీ ఒంటరి పోరాటం చేయడం విశేషం. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎవరినీ పట్టించుకోకపోవడం.. గ్రౌండ్ రియాలిటీని లెక్కలోకి తీసుకోకపోవడమే చంద్రబాబు చేసిన తప్పు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే టీడీపీకి శాపంగా మారుతోంది.
నిజానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఒకలా లెక్కలు మారిపోతాయి. అధికార పార్టీ దూకుడుకి ఎదురెళ్లడం ఎవరికీ అంత తేలిక కాదు. విశాఖ, తిరుపతి కార్పొరేషన్లు అయ్యి చాలా కాలమే అయినా ఎన్నికలు జరగలేదు. చంద్రబాబు ఆ అవకాశాన్ని వదిలేసుకున్నారు. పుంగనూరు, మాచర్ల వంటి చోట్ల బలం లేకపోయింది. కొన్నిచోట్ల టీడీపీ నుంచి అభ్యర్ధులే కరువైపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబును చూసి ధైర్యం చేసే పరిస్థితులు కూడా ఆ పార్టీ నాయకుల్లో లేకపోయింది. ఎన్నికల ఖర్చు కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది. నాడు ఎవరినీ పట్టించుకోని పార్టీ నేడు భరోసా ఇచ్చే ఇచ్చే పరిస్థితిలో లేదు.
ఇదే వైసీపీ ఉపయోగించుకుంటోంది. సీఎం జగన్ కు కలిసివస్తోంది. వైసీపీ అధికారంలో ఉండటం.. పంచాయతీ ఎన్నికల్లో లాభించింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ నాయకులు దూసుకెళ్లిపోతున్నారు. జగన్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి లేదు. అధికారంలో ఉన్న పార్టీని చూసి అభ్యర్ధులు పుట్టుకొస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పార్టీ కూడా భరోసా ఇస్తోంది. తొలిసారి ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్లలో వైసీపీ తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా అధికార మహిమే. అటువంటి పరిస్థితిని చంద్రబాబు వదులుకుని నేడు ఒంటరిపోరు చేయాల్సి వస్తోంది!