(ఫొటో ఎన్డిటివి సౌజన్యంతో )
ఢిల్లీ, జనవరి 25: సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోది చేపట్టిన ఉత్తరాల కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున తరుణంలో మోదీ ‘ఆయుష్మాన్ భారత్’ పథకం గురించి అవగాహన పేరుతో తన ఫొటోతో కూడిన లేఖలను ఆ ఫధకం లబ్దిదారులకు నేరుగా పంపాలని నిర్ణయించారు.
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం ప్రవేశపెట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా 7.5 కోట్ల మంది ప్రజలకు మోదీ లేఖలను అందజేయనున్నారు. ‘నేను నా జీవితంలో పేదరికాన్ని చాలా దగ్గర నుంచి అనుభవించాను. అందుకే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, మహిళలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా రకరకాల పధకాలు ప్రవేశపెట్టాను’ అంటూ మోదీ ఆ లేఖలో పేర్కొంటారు.
ఈ లేఖల కోసం కేంద్రం సుమారు 15.75 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. ఆయుష్మాన్భారత్ నిధులు కాకుండా పాలనాపరమైన నిధులకో ఈ లేఖల కార్యక్రమం చేపడుతున్నట్లు పధకం సిఇఓ ఇందు భూషణ్ చెప్పారని ఎన్డి టివి తెలిపింది.
సార్వత్రితక ఎన్నికల నేపధ్యంలో ప్రధాని ఉత్తరాలతో ప్రచారానికి శ్రీకారం చుట్టారని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఇది ఎన్నికల ప్రచారం తప్ప మరోటి కాదని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ లేఖల కారణంగానే ఆయుష్మాన్బారత్ పధకం నుంచి తప్పుకున్నారు. ఏ రాష్ట్రానికి ఆ స్థానిక భాషలో ముద్రించిన ఈ లేఖలలో ఎన్డిఎ ప్రభుత్వం చేపట్టిన ఇతర పధకాల గురించి కూడా వివరించారు.
ఈ పథకం క్రింద ప్రజలకు ఏ విధంగా ఆరోగ్య సేవలు లభించనున్నాయో వివరిస్తూ ప్రధాని రెండు పేజీల ఉత్తరాన్ని ప్రజలకు రాశారు. తొలి పేజీలో పిఎంజెఎవై గురించి ప్రస్తావించగా రెండవ పేజీలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ఎనిమిది రకాల పథకాల గురించి ప్రధాని వివరించారు. పచ్చ తెలుపు రంగు ఎన్వలప్ కవర్పై మోదీ ఫొటో ముద్రించిన కవర్ను పోస్టల్ శాఖద్వారా బట్వాడా చేయనున్నారు.
ఇప్పటికే కేరళ రాష్ట్రానికి 12లక్షల ఉత్తరాలు తొలివిడతగా చేరుకున్నాయి. రెండు లక్షల లెటర్స్ ఇప్పటికే ప్రజలకు చేరాయి. ఎన్నికల జిమ్మిక్కులో భాగంగా ప్రధాని ఉత్తరాల కార్యక్రమంతో తన స్వంత ప్రచారాన్ని చేపట్టారని పాలక్కాడ్ పార్లమెంట్ సభ్యులు రాజేష్ ఆరోపించారు.