కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సవాలుగా మహా కూటమి నిర్మించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా శనివారం కొల్కతాలో భారీ ర్యాలీ జరగనున్నది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరగనున్న ఈ బహిరంగసభలో కనీసం ముగ్గురు ముఖ్యమంత్రులు, పలువురు ప్రతిపక్ష నాయకులు పాల్గొననున్నారు.
బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్లో సభ ఏర్పాట్లు చూసేందుకు వెళ్లిన మమత మీడియాతో మాట్లాడుతూ, ఈ ర్యాలీ బిజెపికి మృత్యు ఘంటిక అవుతుందని అన్నారు. ప్రధాని పదవికి పోటీ పడగలిగే నేతగా మమతను ఈ ర్యాలీ నిలబెడుతుందని భావిస్తున్నారు. సభ అనంతరం ప్రతిపక్ష నాయకులు కలిసి కూర్చుని బిజెపికి వ్యతిరేకంగా నిర్మించే ఐక్య సంఘటన రోడ్ మ్యాప్ గురించి చర్చిస్తారు.
కొల్కతా ర్యాలీకి కాంగ్రెస్ అగ్రనాయకత్వం హజరవుతుందా లేదా అన్న మీమాంస కూడా తేలిపోయింది. సోనియా, రాహుల్ గాంధీలు దీనికి హాజరు కారనీ, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గె, అభిషేక్ మను సింఘ్వీ హాజరవుతారనీ ఆ పార్టీ ప్రకటించింది.
దీనిని మమత ఐక్య భారత ర్యాలీగా అభివర్ణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఎన్సీపి నేత శరద్ పవార్, హెచ్డి దేవెగౌడ, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్, డిఎంకె అధినేత స్టాలిన్ తదితరులు ర్యాలీలో పాల్గొననున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ ర్యాలీకి హజరయ్యే అవకాశం లేదు. చంద్రబాబుతో ఆయనకు పొసగటం లేదు. నిజానికి మమత కూడా మొదట్లో ఫెడరల్ ఫ్రంట్ అన్న వ్యక్తే. కెసిఆర్ మమతను ఒకసారి కలిశారు కూడా.
విచిత్రంగా బిజెపి ఎంపి శతృఘ్న సిన్హా కూడా ర్యాలీకి హజరవుతున్నారు. మాజీ ఆర్ధికమంత్రి యశ్వంత్ సిన్హాతో కలిసి ఆయన కొంత కాలంగా అసమ్మతి గళం వినిపిస్తున్నారు. యశ్వంత్ పార్టీ ప్రతినిధిగానే తాను కొల్కతా ర్యాలీకి హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. బిజెపి నాయకులు ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరు కావడం లా అని ఆయన ప్రశ్నించారు.