ప్రజాస్వామ్యంలో ఈవిఎంలపై ప్రజలకు నమ్మకం కల్గించాల్సిన భాద్యత ఎన్నికల సంఘంపై ఉందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంల బదులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దేశంలోని సుమారు 23 బిజెపియేతర పార్టీలకు చెందిన ప్రధాన నేతలు సోమవారం రాత్రి ఎన్నికల సంఘాన్ని కలిశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈవిఎంలపై ఎన్నో అనుమాలు ఉన్నాయని అన్నారు. ప్రజల పట్ల జవాబుదారీతనంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సినబాధ్షత ఎన్నికల సంఘం పైన ఉందని చంద్రబాబు అన్నారు.
గంటకు పైగా జరిగిన సమావేశంలో ఈవిఎంలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, అభివృద్ధి చెెందిన దేశాల్లోనూ ఈవిఎంలు వాడటం లేదని, బ్యాలట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని చంద్రబాబు తెలిపారు.
కనీసం 50శాతం వివిప్యాట్ స్లిప్ లు అయినా లెక్కించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో గులాం నబీ ఆజాద్, ఎకె ఆంతోని, మల్లికార్జున్ ఖర్గే, డి రాజా, ఆనంద్ శర్మ, సంజయ్ సింగ్, రాంగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం విపక్ష నేతలు ఎన్ సి పి నేత శరద్ పవార్ నివాసంలో భేటి అయ్యారు.
భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు చంద్రబాబు తెలియజేశారు. బెంగాల్ లో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును అన్ని పార్టీలు ఖండించాయని చంద్రబాబు అన్నారు.