రాజకీయాల్లో నేతలు ఎక్కువగా ప్రత్యర్థి పార్టీ నేతల నుండి, స్వపక్షంలోని ప్రత్యర్థుల నుండి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటుంటారు. అయితే కురుపాం నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిని స్వపక్షంలోని వారు ఎవరు విమర్శించడం లేదు కానీ సొంత మామే ప్రత్యర్థిగా మారారు.
విషయంలోకి వెలితే…కురుపాం నియోజకవర్గంలో శత్రుచర్ల కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఈ నియోజకవర్గం నుండి గెలిచిన వారు రాజకీయంగా ఎదో ఒక పదవి అధిస్టించడం జరుగుతుంది. గతంలో శత్రుచర్ల విజయరామరాజు, కిషోర్ చంద్రదేవ్ లు ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించి రాజకీయంగా ఎదిగారు. విజయరామరాజు సోదరుడైన చంద్రశేఖర్ రాజు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రశేఖర్ రాజు కుటుంబం ఎస్టీ కాదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన కురుపాంలో రాజకీయ ఆధిపత్యం పోగొట్టుకోకుండా ఉండేందుకు చంద్రశేఖర్ రాజు ఎస్టీ సామజిక వర్గానికి చెందిన పుష్ప శ్రీవాణిని కోడలిగా తెచ్చుకున్నారు.
2014లో శ్రీవాణి వైకాపా ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీని నమ్ముకొనే ఉన్నారు. అయితే ఆమె మామ చంద్రశేఖర్ రాజు 2018లో వైకాపాను వీడి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో కుమారుడు పరీక్షిత్ రాజు, కోడలు పుష్ప శ్రీవాణి ఒత్తిడి మేరకు తిరిగి వైకాపాలో చేరారు. రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పుష్ప శ్రీవాణికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిప్యుటీ సీఎం పదవి పదవి కట్టబెట్టారు. అయితే శత్రుచర్ల కుటుంబంలో విభేదాలు తలెత్తడంతో కుమారుడు, కోడలిపైనే చంద్రశేఖర్ రాజు కత్తికట్టారు. కోడలు పుష్ప శ్రీవాణిపై కోపంతో నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని, ప్రభుత్వ పాలన సక్రమంగా లేదంటూ చంద్రశేఖర్ రాజు విమర్శలు అందుకున్నారు. సొంత మామ విమర్శలు చేసినా పుష్ప శ్రీవాణి ఆయనపై గౌరవంతో మిన్నకుండి పోయారు. అయితే ఆమె భర్త పరీక్షిత్ రాజు స్పందించి తండ్రి వ్యాఖ్యలను ఖండించారు. మరో పక్క పుష్ప శ్రీవాణి వర్గీయులు కూడా చంద్రశేఖర్ రాజు వ్యాఖ్యలు ఖండించి ఆయనపైనే విమర్శలు చేశారు. 40 ఏళ్లుగా శత్రుచర్ల కుటుంబం నియోజకవర్గంకు ఏమిచేసింది అంటూ చంద్రశేఖర్ రాజును నిలదీస్తున్నారు.
సొంత మామ నుండే విమర్శలను ఎదుర్కోవాల్సి రావడం పుష్ప శ్రీవాణికి ఇబ్బందిగా మారింది. అయితే కోడలు ఎదుగుదల చూసి ఓర్వలేకనే మామ చంద్రశేఖర్ రాజు విరుచుకుపడుతున్నారని అంటున్నారు. కుటుంబ విభేదాలే కాబట్టి రాబోయే రోజుల్లో సర్దు కుంటాయని భావిస్తున్నారు. చూద్దాం ఏమిజరుగుతుందో!.