పొద్దుపోతే పార్లమెంటు సమావేశాలు మొదలు. “హమ్మయ్య బడ్జెట్ పై చర్చిస్తారు. ఏదో ఒక ఊరట ఇస్తారు. తెలుగు రాష్ట్రాలకు ఊరట ఇస్తారు. కేంద్రం నుండి నిధులిస్తారు. వీలైతే ప్రత్యేక హోదా కూడా ఇచ్చేస్తారు.” ఇవన్నీ సగటు రాజకీయ పాలిత పీడితుడి ఊహలే. కలలే…!
కానీ జగన్, ఆయన బృందానికి మాత్రం ఈ ఊహలు, కళలు వేరుగా వస్తాయి. “హమ్మయ్య మండలిపై చర్చిస్తారు. మండలి మాకు వద్దు అంటూ మేము చేసిన తీర్మానానికి మద్దతిస్తారు. ఆమోదిస్తారు. రాజ్యసభకు పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదిస్తారు. ఇక మండలి రద్దయిపోతుంది. మూడు రాజధానుల ఏర్పాటుకి అడ్డంకి తొలగిపోతుంది.” ఇవన్నీ జగన్ కలలు, ఊహలు…! ఎవరో ఊహించిన, కలగన్న అంశాలకు (అందులోకి తెలుగు రాష్ట్రాలు అంశాలకి) అనుకున్నవి చేసేస్తే అది బిజెపి ఎందుకవుతుంది. వారు మోడీ, అమిత్ షా ఎందుకవుతారు??? అసలు ఈ అంశాలేవీ పట్టించుకోలేదు. రేపటి నుండి మొదలు కానున్న పార్లమెంటు సమావేశాల చర్చ, అజెండా అంశాల్లో అసలు మండలి రద్దు అంశాన్నే చేర్చలేదు.
ఇటు ఊరట… అటు వేరు దారట…!
మండలి అంశం పార్లమెంటు చర్చనీయాంశాల్లో చేర్చకపోవడం టిడిపి, రాజధాని ప్రాంత రైతులు, కొన్ని వర్గాలకు మంచి ఊరట లభించే అంశమే. ఇప్పుడు లేదంటే మరో నాలుగు నెలలు (మళ్ళీ వర్షాకాల సమావేశాల) వరకు లేనట్టేనని కాస్త ప్రశాంతంగా నిద్రపోతారు. అప్పుడు కూడా ఏదో మెలిక పెట్టాలనే కోరుకుంటారు. ఇక వైసిపి వర్గాలు మాత్రం మరో దారిని ఆలోచిస్తున్నాయి. “ఏమో… ఇప్పుడు అజెండాలో లేకపోతే లేదు మధ్యలో టేబుల్ అంశంగా పెట్తాపోతారా? మా విజయసాయిరెడ్డి ఏదో చక్రం తిప్పకపోతారా?” అనే ఆశల్లో ఉంటారు. జరిగినా జరగవచ్చు. మోడీకి మూడ్ వస్తే, అమిత్ షాకి ఆంధ్రపై అమితానందం కలిగితే వెంటనే “ఆ ఆంధ్ర ప్రదేశ్ మండలి రద్దు ఫైల్ పట్రండి, టేబుల్ అంశంగా పెట్టేయండి, తేల్చేద్దాం” అని అనకపోతారా అని వైసిపి వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. అలా మండలి అంశంపై ఇరు వర్గాలు ఇరు దారుల్లో ఆలోచిస్తూ ఈ పార్లమెంటు అంశాలను చూస్తుంటాయి.
రాజకీయంగా మనకేంటి…?
ఇక బిజెపి పాత్ర దీనిలో ముఖ్యం. పాపం అన్ని రాష్ట్రాలు వారి గుప్పిట్లో ఉండాలనే బలమైన కోరికతో మోడీ, అమిత్ షా ద్వయం ఉవ్విళ్లూరుతోంది. “ఈ జగన్ వారితో ఉన్నట్టే ఉంటున్నాడు, కానీ కేసీఆర్ అంటూ మధ్యలో పోతున్నాడు. ఆ కేసిఆర్ ఎప్పుడు ఎం వంకల లింకు పెడతాడో తెలియదు.” అనుకుని మనకు రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయి? మండలి ఉంచితే మనకేంటి? మండలి తీస్తెస్తే మనకేంటి? అనుకుంటూ విశ్లేషణలు చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడేమి అత్యవసరంగా మండలిని రద్దు చేసేయాల్సిన పని లేదు అని ఇక్కడి నుండి కొందరు లాబీయింగ్ చేసిన మీదట ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టినట్టు సమాచారం. అయినా అనుకుంటాం గాని మండలి రద్దు అనేది ఏళ్ల తరబడి ప్రక్రియ అని “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది. దీనిలో అంతిమంగా పైనున్నోడి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.
– శ్రీనివాస్ మానెం