అలయన్స్ ఎయిర్ లైన్స్ నిర్లక్ష్య వైఖరి కారణంగా శంషాబాద్ (హైదరాబాద్) ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవేళ ఉదయం 9.05 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి కొల్హాపూర్ వెళ్లాల్సిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం సమయానికి రాకపోవడంతో ప్రయాణీకులు గంటల తరబడి పడిగాపులు కాశారు. ఉదయం 9.05 గంటలకు రావాల్సి ఉండగా, నాలుగు సార్లు అలయన్స్ ఎయిర్ లైన్స్ షెడ్యుల్ మార్చిందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. దాదాపు పది గంటలకుపైగా నిరీక్షించిన ప్రయాణీకులు సంబందిత సిబ్బందిని నిలదీసినా అసలు విమానం ఉందో కాన్సిల్ అయ్యిందో చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో విమానాశ్రయంలోని గేట్ నెం 10 వద్ద ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. అలయన్స్ ఎయిర్ లైన్స్ ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు సాయంత్రం ఆరు గంటల తరువాత ఫ్లైట్ క్యానిల్ అయినట్లు వెబ్ సైట్ లో పేర్కొనడంతో ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలయన్స్ ఎయిర్ లైన్స్ ఇంతకు ముందు ఎయిరిండియా అనుబంధ సంస్థగా ఉండేది. అయితే ఎయిర్ ఇండియాను టాటా గ్రూపు దక్కించుకున్న తర్వాత అలయన్స్ తమ అనుబంధ సంస్థ కాదనీ ఈ ఏడాది ఏప్రిల్ 15న ప్రకటించింది. అలయన్స్ ఎయిర్ లైన్స్ కు సంబంధించి బుకింగ్ లు, విచారణలకు ఎయిర్ ఇండియా బాధ్యత ఉండదని స్పష్టం చేసింది.