Pathapatnam: కలమట మోహన్ రావు .. ఈ పేరు ఇప్పుడు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ సిక్కోలు జిల్లాలో 40 ఏళ్ళు పైబడిన రాజకీయ అభిమానులకు బాగా తెలుసు.. పాతపట్నం నియోజకవర్గం నుండి ఓ సారి స్వతంత్రంగా, ఆ తర్వాత టీడీపీ నుండి మొత్తం మీద అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత..! రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అటువంటి కలమట వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వెంకటరమణ రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయారు..! ఇప్పుడు సొంత నియోజకవర్గంలో టికెట్ వస్తుందో రాదో తెలియక.. ఆరోపణల్లో కూరుకుపోయి.. పార్టీ నమ్మకం కోల్పోయి.. పార్టీలో పట్టు కోల్పోతున్నారు.. ఇదే సమయంలో ఆ నియోజకవర్గంలో మామిడి గోవిందరావు టీడీపీలో దూసుకెళ్తున్నారు. జిల్లాస్థాయిలో మంచి కార్యక్రమాలు చేపడుతూ.. అటు సేవ, ఇటు రాజకీయంలో ముద్ర వేస్తున్నారు. దీంతో పాతపట్నం టీడీపీలో కొత్త కథలు మొదలయ్యాయి..!
Pathapatnam: వైసీపీ సేఫ్ కాదు.. కానీ..!?
ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీకి అంత సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన వైసీపీ.. కొన్ని నెలల కిందట జరిగిన స్థానిక ఎన్నికల్లో హిరమండలం మండల జెడ్పిటీసీ స్థానాన్ని కోల్పోయింది. దీంతో ఇక్కడ వైసీపీ పనైపోయింది.. టీడీపీ బలపడింది అనే సంకేతాలు బలంగా వెళ్లాయి. 2014లో వైసీపీ తరపున గెలిచిన కలమట వెంకటరమణ.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ టికెట్ ద్వారా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో పార్టీ మారడం.. ఆపై కొన్ని ఆరోపణలు తీవ్రంగా రావడం.. కార్యకర్తల్లో కూడా అసమ్మతి రాగలడంతో సైలెంట్ అయ్యారు. పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. క్యాడర్ ని వదిలేసారు. సరిగ్గా ఇదే సమయానికి మామిడి గోవిందరావు తెరపైకి వచ్చారు. నిజానికి గోవిందరావు 2014 కి ముందు నుండీ టీడీపీలో కీలకంగా పని చేస్తున్నారు. కానీ టికెట్ విషయంలో మొండిచేయి ఎదురయింది. 2019లో గోవిందరావుకి టికెట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. చంద్రబాబు కలమట తండ్రితో ఉన్న బంధానికి తలొగ్గారు.. దీంతో 2019 కి ముందు ఉన్న వ్యతిరేకత.. వెంకటరమణ చేసిన కొన్ని తప్పిదాల ఫలితంగా పార్టీ ఓడిపోయింది. ఓడిన తర్వాత వెంకట రమణ సైలెంట్ అయ్యారు. మళ్ళీ తనదే అవకాశం ఉండడం, పార్టీకి కూడా నియోజకవర్గంలో పెద్ద దిక్కు లేకపోవడంతో సరైన సమయం చూసుకుని గోవిందరావు వచ్చారు. కీలకంగా పని చేసి శ్రేణులకు దగ్గరయ్యారు. ఆర్ధిక చేయూత అందించారు. సరిగ్గా గోవిందరావు యాక్టీవ్ అయ్యి.. టికెట్ విషయంలో బాబు దృష్టిలో పడడంతో మళ్ళీ వెంకటరమణ ప్రయత్నాలు ముమ్మరం చేశారు..!
పార్టీలో డైలమా.. కానీ..!?
ప్రస్తుతం టీడీపీ పెద్దలు ఏమి తేల్చుకోలేకపోతున్నారు. సర్వేల్లో, కార్యకర్తల అభిప్రాయాల్లో ఎక్కువగా మామిడి గోవిందరావుకి సీటు ఇస్తే బాగుంటుందని పార్టీ పెద్దలకు సంకేతాలు వెళ్తున్నాయి. కానీ కలమట సీనియర్ కావడం.. బలమైన క్యాడర్ ఉండడం.. తరచూ లాబీయింగ్ చేస్తుండడంతో ఆయన వర్గం చురుగ్గా ఉంది. ఈ సీటు విషయంలో పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.. కానీ దిగువస్థాయి కార్యకర్తలు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తుంది. కలమట కంటే గోవిందరావు బెటర్ అనే అంశాన్ని పార్టీ పెద్దలకు వివరించి.. ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. పరిచయాలు, పేరు, ఆర్ధికవనరులు, క్యాడర్ తో కలిసిపోయే అంశాల్లో గోవిందరావు ముందు వరుసలో ఉన్నారని.. వెంకటరమణ విషయంలో పార్టీ మరో పదవి ఆలోచిస్తే మంచిదంటూ కార్యకర్తల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కలమట టికెట్ విషయంలో ఖరారు చేయాలంటూ అచ్చెన్నను కలవడం.. ఆ తర్వాత పార్టీ పెద్దలను కలవడంతో లాబీయింగులు జోరుగా సాగుతున్నట్టు ప్రచారం మొదలయింది..!