Pavan Kalyan: తప్పెవరిది..? జనసేనాని ప్రశ్నిస్తున్నదెవరిని..!?
బాధ్యులెవరు..? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నదెవరిని..!?
స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నదెవరు..? జనసేనాని మాటల్లో ఆపాలని అడుగుతున్నదెవరిని..!?
పొత్తు ఉంటె పోరాటాలు మానెయ్యాలి.. స్నేహం అనుకుంటే ఇంట్లో పడుకోవాలి.. కానీ ఉద్యమాల్లోకి వచ్చి మిత్రపక్షం చేస్తున్న అన్యాయాన్ని కూడా కనీసం, సున్నితంగా ప్రశ్నించలేకపోతే రాజకీయం చేయడం మానుకోవడం మేలేమో…!?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా చురుకైన రాజకీయాన్ని మొదలు పెట్టారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన చేపట్టి రెండున్నరేళ్లు అవుతోంది. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్నీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. జనసేన పార్టీకి 2024 ఎన్నికలు జీవన్మరణ పరిస్థితి, ఎందుకంటే 2014 నాటికి పార్టీ పెట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ పార్టీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీకి మద్దతు ఇచ్చి ఎన్నికల గోదాలోకి దిగలేదు. 2019 ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో ఎన్నికలో గోదాలోకి దిగినప్పటికీ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుని 5.6 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు చేసుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పరాజయం పరాభవాన్ని మూటగట్టుకున్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాలను వదిలిపెట్టలేదు. వేరే వ్యూహంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుకు తెరతీసి రాజకీయ క్షేత్రంలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఈ తరుణంలో 2024 ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డూ ఆర్ డై అనే పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో తన హవా చాటుకుని కనీసం 15 సీట్లు అయినా సాధిస్తే పార్టీకి, ఆయనకు గౌరవ ప్రదమైన పరిస్థితి వస్తుంది. 2024 ఎన్నికల్లోనూ గత ఎన్నికలకు మాదిరిగానే ఫలితాలు వస్తే తన అన్న చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీ మాదిరిగానే జెండా పీకేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
Pavan Kalyan: పదేళ్ల పిల్లాడికి తెలుసు.. పవన్ ఎందుకిలా..!?
రాష్ట్రంలో బీజేపీ దారుణమైన రాజకీయాలు చేస్తుంది. బీజేపీని అడగలేక, మింగలేక, కక్కలేక, ఆ పొత్తు నుండి బయటకు రాలేక.. ఆ తప్పులన్నీ వైసీపీపైకి వేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. నిజానికి స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టింది కేంద్రమే.. స్టీల్ ప్లాంట్ కేంద్రం పరిధిలోనే ఉంది. పవన్ కళ్యాణ్ అడగాలి అంటే కేంద్రాన్ని అడగాలి. ముందు కేంద్రాన్ని నిలదీయాలి. అక్కడ సభా వేదికపై, నిరసనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు.. స్టీల్ ప్లాంట్ విషయంలో మెయిన్ విలన్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వమే అని.. కానీ నిన్న పవన్ మాట్లాడుతుంటే ఏమి అనలేక, లోలోపల నవ్వుకుని, తిట్టుకునే పరిస్థితి వచ్చింది..! స్టీల్ ప్లాంట్ అంశంలో 75 శాతం పాపం బీజేపీ.., 25 శాతం పాపం వైసీపీ మూటగట్టుకుంటుంది.. పవన్ కళ్యాణ్ నిలదీయాలి, ప్రశ్నించాలి, అడగాలి అనుకుంటే ముందుగా బీజేపీని అడగాలి. కేంద్రాన్ని నిలదీయాలి. 75 శాతం పాపం మూటగట్టుకున్న బీజేపీని వదిలేసి.., 25 శాతం పాపం ఉన్న వైసీపీని నిలదీస్తే లాభమేముంది..!? పైగా ఆ బీజేపీ తనతో స్నేహంలో ఉన్న పార్టీ కదా..!? జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం విషయం గానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంగానీ కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దోషే అన్నట్లుగా ప్రజలకు చెప్పనున్నారు. 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వైసీపీ ఈ కీలక అంశాలపై కేంద్రంతో ఎందుకు పోరాటం చేయడం లేదని పవన్ ప్రశ్నిస్తున్నారు.
వెరైటీ రాజకీయాలు..!
పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాల్లో బీజేపీతో జత కట్టిన జనసేన పైనా ఏపి ప్రజల నుండి తీవ్ర ఒత్తిడి వస్తోంది. దోస్తాన్ ఉంది కదా అని కేంద్రానికి వంత పాడితే రాష్ట్రంలో జనసేనకు ప్రజల నుండి చీత్కారాలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని గమనించిన జనసేన కేంద్రంలోని బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. అందుకే రీసెంట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు. తనకు ఒక్క పార్లమెంట్ సభ్యుడు ఉన్నా కేంద్రాన్ని గట్టిగా నిలదీసేవాడినని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ … అధికార వైసీపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు కేంద్రంతో పారాడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన నిలిచిపోతుందని పేర్కొన్నారు. తనకు అధికారం, సీట్లు లేకపోయినా ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తానని అంటున్నారు పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైసీపీ అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకువెళ్లాలంటూ అల్టిమేటమ్ జారీ చేశారు. ఒక వేళ అధికార వైసీపీ కలిసి రాకపోయినా ఇతర రాజకీయ పక్షాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ నేతలతో ఢిల్లీకి వెళ్లి తాడోపేడో తేల్చుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో దీనిపై ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?