అమరావతి, మార్చి 30: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక విశాఖ జిల్లా గాజువాక వాసి అవుతున్నారు. జరుగుతున్న ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా గాజువాకలో ఉండేందుకే పవన్ నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
గాజువాక వై జంక్షన్లో సమీపంలో కర్ణవారిపాలెంలో పవన్ కళ్యాణ్ కోసం నివాసం ఏర్పాటు చేశారు. ఇకపై పవన్ కళ్యాణ్ గాజువాక ప్రాంత ప్రజల కోసం ఇక్కడే ఉండనున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ నేడొక ప్రకటనలో తెలిపారు.
సాయంత్రం ఐదు గంటలకు గాజువాక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర (రోడ్షో) చేయనున్నారని ఆయన తెలిపారు. అగనంపూడి జంక్షన్ నుండి యాత్ర ప్రారంభమై రాజీవ్నగర్, దువ్వాడ, వడ్లపూడి, తుంగ్లాం, నాతయ్యపాలెం, షీలానగర్, అక్కిరెడ్డిపాలెం, మింది వరకు రోడ్షో కొనసాగనుంది. ప్రజాయాత్ర అనంతరం గాజువాకలో ఆయన ఉండే ఇంటికి వెళతారు.