పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా సినిమాల్లో ఏం చేసినా ఫ్యాన్స్ ఊగిపోతారు.. ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ.. అదే స్ట్రాటజీ పాలిటిక్స్ లో వర్కౌట్ కాదు. ఈ విషయం పవన్ కు తెలియంది కాదు.. కొత్తగా చెప్పేదీ కాదు. కానీ.. కుహనా రాజకీయాలకు జనసేన అతీతం అని జనసేనాని చెప్తూనే ఉంటారు. అయితే.. చేతల్లో సమకాలీన రాజకీయాలకు, పరిస్థితులకు జనసేన తలొగ్గిందా..? అనే అనుమానాలు లేకపోలేదు. ఇటివలి పవన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన చూస్తే అదే అనిపిస్తుంది. ‘లీడర్’ సినిమాలో కోట శ్రీనివాసరావుతో ఆహుతి ప్రసాద్ భేటీ అయ్యి రాజకీయాంశాలు మాట్లాడి.. బయటకొచ్చి మీడియాతో కేవలం ఫ్రెండ్లీ సమావేశం అంటాడు. జనసేనాని ఢిల్లీ పర్యటన.. ప్రకటనలు ఇలానే అనిపిస్తున్నాయిన చెప్పాలి.
బీజేపీ చెప్పిందే పవన్ చెప్పారా..?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశంలో ‘తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిపై చర్చించాం.. జనసేన అభ్యర్థా.. బీజేపీ అభ్యర్థా అనే విషయంపై కమిటీ నిర్ణయిస్తుంది.. అమరావతిలో రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉంటుంది.. ఏపీలో ఆలయాలపై దాడులపై కూడా చర్చించాం.. పోలవరంపై ఖర్చంత కేంద్రమే భరించాలని అని చెప్పాం..’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ‘ఉప ఎన్నిక కోసం ఈ పర్యటన జరగలేదు.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం.. రాజధాని అమరావతి, పోలవరం అంశాలు చర్చించాం.. అమరావతే రాజధానిగా ఉండాలనేదే జనసేన నిర్ణయం..’ నాదెండ్ల మనోహర్ అంటున్నారు. నిజానికి బీజేపీ కూడా ఇవే మాటలను చెప్తోంది. ఢిల్లీ వెళ్లి జనసేన తేల్చింది ఇదా.. అనే వాఖ్యాలు వినిపిస్తున్నాయి.
పవన్ ఆంతర్యం ఇదేనా..?
జీహెచ్ఎంసీలో నామినేషన్లు వేసాక తప్పుకోవడం.. కొన్ని సీట్లైనా అడగలేకపోవడం.. మొత్తంగా తప్పుకోవడంపై విమర్శలు వచ్చాయి. మరోవైపు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్ధిని నిలబెడతాం అని ఎప్పటినుంచో చెప్తోంది. దీంతో.. తమకు అవకాశం ఇవ్వాలని కోరేందుకే జనసేనాని ఢిల్లీ వెళ్లారని కూడా అంటున్నారు. జీహెచ్ఎంసీ నేపథ్యంలో విమర్శలు తట్టుకోలేక.. ఏపీలో క్యాడర్ కు నమ్మకం కలిగించేందుకు.. తిరుపతి సీటు దక్కించుకునేందుకే ఈ పర్యటన అనే వాదనలూ లేకపోలేదు. కానీ.. అక్కడ ఉన్నది బీజేపీ.. అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా..? అందుకే కమిటీ అంటూ ముందుకొచ్చారు. పనిలో పనిగా పోలవరం, అమరావతి అంటూ రాగాలు తీసారని అంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ల కెరుక..!