(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)
గంటకు 60 నిముషాలు… నిమిషానికి 3,600 సెకండ్స్… ఈ సమయంలో ఒక పెళ్లి విషయం చర్చిస్తే అసంపూర్తిగా ముగుస్తుంది. గొడవ గురించి మాట్లాడితే మరింత పెరుగుతుంది… కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఆ 60 నిమిషాల్లో రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న 7 రకాల సమస్యలపై బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో చర్చించామని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది.
చర్చించారా… అప్పజెప్పారా?
ఒక విషయం పై చర్చ అంటే దానిలో ఇరువురి అభిప్రాయాలు క్రోడీకరించి ఉంటాయి. ఒక అంశం మీద ఉన్న భిన్న అభిప్రాయాలను వివరాలను ఒకరినొకరు తెలుసుకొని దాని మీద ఫైనల్ గా ఒక నిర్ణయానికి వస్తారు. దీన్ని చర్చ అంటారు. సాధారణ టీవీ డిబేట్ లోనే చర్చకు కనీస సమయం గంటకు పైగా ఇస్తున్నారు. అలాంటిది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జేపీ నడ్డా ల మధ్య జరిగిన చర్చలు 7 అంశాలపై కేవలం గంటకు తక్కువగానే సాగాయి. అంటే ఇరువురు నేతలు ఒక విషయం పై కనీసం పది నిమిషాలు కూడా చర్చించలేదని పవన్ మాటలను బట్టే అర్థమవుతోంది. అందులోనూ జేపీ నడ్డా కు తెలుగు రాదు. ఇంగ్లీష్ కంటే హిందీ లో ఆయన ప్రావీణ్యం ఎక్కువ. ఇక పవన్ కు ఇంగ్లీష్ లో మంచి పట్టు ఉన్న హిందీలో అంతంతమాత్రంగానే మాట్లాడగలరు. అలాంటిది జేపీ నడ్డా కు కేవలం పది నిమిషాలు కూడా తక్కువ సమయంలో కీలకమైన ఒక అంశాన్ని హిందీలో వివరించడం ఎలా సబబు అయిందో అర్థం కాని ప్రశ్న. పవన్ ఆయనతో చర్చించారు లేక ఉన్న విషయాలు అప్పజెప్పి బయటకు వచ్చారా అనేది పవన్ చెప్పిన గంట సమయాన్ని బట్టే అర్థమవుతుంది.
కమిటీ ఏంటీ? మళ్ళీ అన్ని విషయాలు ఇందులో ఎలా?
తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి అనే అంశంలో ఇరు పార్టీల మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. ఈ తరుణంలోనే పవన్ డిల్లీకి వచ్చారు. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునేందుకు ఆయన దీన్ని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని జేపీ నడ్డా కు పవన్ చెప్పిన ఆయన దీనికి ససేమిరా అన్నట్లు సమాచారం. మిత్ర పక్షానికి ఈ సీటు ఇవ్వడం వల్ల వైఎస్ఆర్ సీపీని ఎదుర్కోలేమని భావించడం వల్లనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటను, కోరికను పరిగణలోకి తీసుకోలేదు. బిజెపి జనసేన నాయకులతో మళ్లీ కమిటీ ఏర్పాటు చేసి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని పవనే బయటకు వచ్చి చెప్పారు. అంటే లోపల జనసేన అధినేత తిరుపతికి పెట్టిన అభ్యర్ధనను నడ్డ తోసిపుచ్చి నట్లే భావించాలి. ఇప్పుడు ఈ కమిటీ వల్ల ఏమి ఉపయోగం.. ఎవర్ని చివరిగా అభ్యర్థిగా ప్రకటిస్తారు.. ఎందుకీ దోబూచులాట అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.
కీలక అంశాల ప్రస్తావన ఎందుకు పవన్?
పవన్ చెబుతున్నట్లుగా రాజధాని అమరావతి అంశం, పోలవరం పనులు, దేవాలయాలపై దాడులు, శాంతిభద్రతల తీరు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలి అని అంశాలమీద జేపీ నడ్డా తో చర్చ జరిగినట్లు పవన్ చెప్పారు. ఇన్ని కీలకమైన రాష్ట్ర స్థాయి అంశాలు పార్టీ అంశాలను కేవలం గంట లోపల జాతీయ అధ్యక్షుడు తో ఏం మాట్లాడారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మీరు ప్రణాళిక ఏమిటి అనేదానిపై స్పష్టత లేదు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిత్వం కోసం వెళ్లిన పవన్ అక్కడితో ఆగిపోయి ఆ విషయాన్ని మీడియాకు చెప్తుంటే పెద్ద సమస్య ఉండేది కాదు… రాష్ట్రంలోని కీలక అంశాలన్నీ జేపీ నడ్డా తో ప్రస్తావించినట్లు ఆయన చెప్పడం, గంట కూడా కాకుండానే జేపీ నడ్డా నివాసం నుండి పవన్ మనోహర్ లు బయటకు రావడం చూసి మీడియా కూడా.. ఇంత తక్కువ సమయంలో అన్ని మాట్లాడారా అంటూ నోటి మీద వేలేసుకుంది.